మున్సిపల్ ఉద్యోగులకు శుభవార్త... జీతభత్యాలు చెల్లింపుపై జగన్ కీలక నిర్ణయం
మున్సిపాలిటీలలో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ముట్టుకోదని... ఆ డబ్బును అక్కడే ఖర్చు చేస్తామన్నారు. స్ధానికంగా పలు అభివృద్ధి పనులు, కార్యక్రమాల కోసం వ్యయం చేయాలని సీఎం జగన్ సూచించారు.
అమరావతి: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, సిఫార్సులకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్బీ) అయిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో చేపట్టవలసిన సంస్కరణలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందే విధంగా ఒక ఎస్ఓపీ రూపొందించాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయకుమార్తో పాటు ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... మున్సిపాలిటీలలో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ముట్టుకోదని... ఆ డబ్బును అక్కడే ఖర్చు చేస్తామన్నారు. స్ధానికంగా పలు అభివృద్ధి పనులు, కార్యక్రమాల కోసం వ్యయం చేయాలని సూచించారు. ఈ మెసేజ్ ప్రజల్లోకి బలంగా వెళ్లాలన్నారు. మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి (సెల్ఫ్ సస్టెయినబుల్) సాధించాలని... ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. మున్సిపాలిటీల ఉద్యోగుల జీతభత్యాలను 010 పద్దు ప్రకారం ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు.
read more విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్:రేపు ప్రారంభించనున్న నితిన్ గడ్కరీ
''శానిటేషన్ బాగుండాలి, వాటర్ అండ్ సీవరేజ్ కూడా పక్కాగా ఉండాలి. ప్రతి రోజూ తప్పనిసరిగా చెత్తను తరలించాలి. వీధులనూ పరిశుభ్రం చేయాలి, డ్రైనేజీలను తరుచూ క్లీన్ చేయాలి. శానిటేషన్, వాటర్ అండ్ సీవరేజ్కు సంబంధించి రోజువారీ నిర్వహణ వ్యయాన్ని (ఓ అండ్ ఎం) మాత్రమే ఛార్జీలుగా వసూలు చేయాలి'' అని సూచించారు.
''మున్సిపాలిటీలలో ఆదాయం ఎంత? వాటి వ్యయం ఎంత? జీతాల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? అభివృద్ధి పనులకు ఎంత వ్యయం చేస్తున్నారు? వంటి అన్నీ తెలుసుకుని, ఇంకా ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై ఎస్ఓపీ రూపొందించండి. ప్రజలకు ఇంకా మెరుగైన సేవలందించడంతో పాటు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా ఆ ఎస్ఓపీలు ఉండాలి'' అని సీఎం ఆదేశించారు.