మన సంపద మనకే దక్కాలి: కేంద్రంపై పోరాటానికి బాబు పిలుపు
ఒంగోలు ధర్మపోరాట సభ రోజునే మరోచోట పోటీ దీక్షలు చేయిస్తారా అంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విపక్షాలపై దుమ్మెత్తిపోశారు. అయితే ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని చంద్రబాబునాయుడు చెప్పారు.
అమరావతి: ఒంగోలు ధర్మపోరాట సభ రోజునే మరోచోట పోటీ దీక్షలు చేయిస్తారా అంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విపక్షాలపై దుమ్మెత్తిపోశారు. అయితే ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని చంద్రబాబునాయుడు చెప్పారు.
శుక్రవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టీడీపీ ఎంపీలతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఏపీకి జరిగిన అన్యాయం, కేంద్రం ఏ రకంగా వ్యవహరించిందనే విషయమై టీడీపీ ఎంపీలు లోక్సభ, రాజ్యసభలో ఎండగట్టారని చంద్రబాబునాయుడు అభినందించారు.
బీజేపీ ఏపీకి ఏ రకంగా అన్యాయం చేసిందనే విషయమై ఎంపీలు ఎండగట్టారని చెప్పారు. జీరో అవర్, ప్రశ్నోత్తరాలు, స్వల్పకాలిక చర్చల్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించారని చంద్రబాబునాయుడు చెప్పారు. కేంద్రం ఎలా మోసం చేసిందనే విషయాన్ని టీడీపీ ఎంపీలు దేశానికి మొత్తం తెలిసేలా చేశారని బాబు గుర్తు చేశారు.
ఏపీ సంపద ఏపీకి దక్కాలి మన వనరులు మనకే కావాలి.. కానీ, మనకిచ్చిన హమీలను నెరవేర్చడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టాన్ని అమలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు.ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నట్టు ఆయన చెప్పారు. ఒంగోలులో ఈ నెలలో నిర్వహించే ధర్మపోరాట దీక్షలకు హజరు కావాలని ఆయన ఎంపీలను కోరారు.
టీడీపీని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. మూడు పార్టీలు కలిసి లాలూచీ చేస్తారా అని ఆయన టీడీపీ ఎంపీలను ప్రశ్నించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన సమయంలోనే పోటీ దీక్షలు పెడతారా అని ఆయన విపక్షాలను ప్రశ్నించారు. విపక్షాల తీరును ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.