YSR Kadapa: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

YSR Kadapa: సీఎం చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడప జిల్లాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వైఎస్ఆర్ జిల్లా‌గా ఉన్న పేరు‌ను మళ్లీ వైఎస్ఆర్ కడప జిల్లా‌గా మార్చింది. దీనికి సంబంధించిన జీవో (జీవో నం. 170)ను విడుద‌ల చేసింది. ప్రత్యేక ముఖ్య కార్యదర్శి (FAC) జీ.జయలక్ష్మి అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేశారు. 

ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటుపై 1974 చట్టం కింద తాజాగా పేరును మార్చుతూ ఏపీ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. మార్చిలో జరిగిన రాష్ట్ర మంత్రి మండ‌లి సమావేశంలో ఈ పేరు మార్పున‌కు ఆమోదం లభించింది.

మునుపటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చారు. అయితే, పౌర సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు, జిల్లాకు చెందిన ప్రముఖులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రజల నుండి వచ్చిన పెద్దఎత్తున వినతుల నేపథ్యంలో తాజాగా చంద్ర‌బాబు స‌ర్కారు పేరు మార్పు నిర్ణ‌యం తీసుకుంది.

కాంగ్రెస్ నేత ఎన్. తులసి రెడ్డి కూడా వైఎస్ఆర్ జిల్లా పేరును మళ్లీ వైఎస్ఆర్ కడపగా మార్చాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా 1808లో ఏర్పడిందనీ, “దేవుని కడప” అనే గ్రామం తిరుమలకు ప్రవేశ ద్వారం అనే ప్రాచీన విశ్వాసం ఉంది. అందువల్లే “కడప” అనే పేరు జిల్లా పేరు అయిందని ఆయ‌న చెప్పారు. .

వైఎస్ఆర్ కుటుంబానికి గౌరవంగా ఉన్న ప్రాంతం

వైఎస్ఆర్ కుటుంబానికి రాజకీయ బలంగా ఉండే రాయలసీమ ప్రాంతంలో ఉన్న కడప జిల్లా పేరు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థంగా 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చింది. ఆ తరువాత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం కడపను తొలగించింది.

కాంగ్రెస్ నాయ‌కులురాలు, వైఎస్ఆర్ కుమార్తె వై.ఎస్. ష‌ర్మిల స్పందిస్తూ “పేరు మార్పు నాకు వ్యక్తిగతంగా బాధాకరమైనప్పటికీ, కడప జిల్లా చరిత్ర, సంస్కృతి గౌరవార్థంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది” అని తెలిపారు. ఈ నిర్ణయం వెనుక రాజకీయ కక్షలు ఉంటే, ఎన్టీఆర్ జిల్లా పేరు కూడా ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా మార్చాలని సూచించారు.