మల్లన్న కొలువుదీరిన శ్రీశైలంలో... వెండి నాణేలు, తామ్ర శాసనాలు లభ్యం
శ్రీశైలంలోని ఘంటామఠం ప్రాంగణంలోని చిన్న శివాలయాన్ని పునరుద్ధరించేందుకు పనులు చేస్తుండగా రాతి గోడల్లో ఇవి లభించాయి.
కర్నూల్: ప్రముఖ శైవక్షేత్రం, మల్లికార్జునస్వామి వెలిసిన శ్రీశైలంలో తాజాగా వెండి నాణేలు, తామ్ర శాసనాలు లభ్యమయ్యాయి. కర్నూలు జిల్లా శ్రీశైలంలోని పంచ మఠాల్లో ఒకటైన ఘంటామఠంలో మంగళవారం తామ్ర శాసనాలు, వెండి నాణేలు లభ్యమయినట్లు తెలుస్తోంది. ఘంటామఠం ప్రాంగణంలోని చిన్న శివాలయాన్ని పునరుద్ధరించేందుకు పనులు చేస్తుండగా రాతి గోడల్లో ఇవి లభించాయి.
read more విజయవాడ దుర్గమ్మ ఉత్సవరధంపై వెండి సింహాలు మాయం... సోము వీర్రాజు ఆగ్రహం (వీడియో)
రాతి గోడల మధ్య మూడు తామ్ర శాసనాలు, మొత్తం 245 వెండి నాణేలను అధికారులు గుర్తించారు. దేవస్థానం ఈవో రామారావు, తహసీల్దారు రాజేంద్రసింగ్, ఎస్సై హరిప్రసాద్ సిబ్బందితో వచ్చి వాటిని పరిశీలించారు. తామ్ర శాసనాల్లో నాగరి, కన్నడ లిపి, శివలింగాన్ని రాజు మొక్కుతున్నట్లు, నంది, గోవు చిత్రాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. వెండి నాణేలు 1800 నుంచి 1910 సంవత్సరాలకు చెందిన బ్రిటిష్ పాలన నాటివిగా గుర్తించారు.