సారాంశం
ఓ చిన్నారి రైల్వే ప్లాట్ ఫారమ్ పై ఆడుకుంటూ అక్కడున్న రెండు స్థంభాల మధ్య తలపెట్టింది. దీంతో ఆమె తల అందులో ఇరుక్కుపోయింది. రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి, ఓ వెల్డర్ సాయంతో స్థంభాలను కత్తిరించడంతో బాలిక క్షేమంగా బయటపడింది.
తన తల్లిదండ్రులతో కలిసి ఓ చిన్నారి రైల్వే స్టేషన్ కు వెళ్లింది. రైలు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఓ చిన్నారి ఆడుకుంటూ వెళ్లి రెండు స్థంభాల మధ్య తలపెట్టింది. కానీ దానిని వెనక్కి తీసుకోలేకపోయింది. దాదాపు గంటన్నరపాటు నరకయాతన అనుభవించింది. అనంతరం రైల్వే సిబ్బంది వచ్చి, ఆపరేషన్ చేపట్టి బాలికను రక్షించారు. ఈ ఘటన ఏపీలోని రేణిగుంట రైల్వే స్టేషన్ లో శుక్రవారం జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. సాయి యశస్వి అనే 18 నెలల చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి స్వర్ణ జయంతి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించేందుకు రేణిగుంట రైల్వే స్టేషన్ కు శుక్రవారం చేరుకుంది. అయితే రైలు కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న సమయంలో ఆ ఫ్లాట్ ఫారంపై చిన్నారి ఆడుకుంటోంది. ఈ క్రమంలో ఆ ప్లాట్ ఫారంపై ఉన్న స్టీల్ స్థంభాల మధ్య గాప్ లో తలపెట్టింది.
అయితే ఆ తన తలను ఆమె వెనక్కి తీసుకురాలేకపోయింది. చిన్నారి ఏడుపు వినిపించడంతో తల్లిదండ్రులు ఆమెను గమనించారు. ఆ చిన్నారి తలను వెనక్కి తీసుకొచ్చేందుకు వారు ప్రయత్నించారు. కానీ వారితో సాధ్యం కాలేదు. ఈ సమాచారం అక్కడున్న ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ), రైల్వే స్టేషన్ సిబ్బందికి చేరవేశారు. చిన్నారిని కాపాడాలని కోరారు.
దీంతో వెంటనే వారు రంగంలోకి దిగారు. సహాయక చర్యల కోసం వారు ఓ వెల్డర్ ను తీసుకువచ్చారు. ఆయన బాలికకు ఎలాంటి హాని కలిగించకుండా జాగ్రత్తగా స్తంభాలను కత్తిరించాడు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ ఆపరేషన్ లో బాలిక క్షేమంగా బయటపడింది. అనంతరం తన తల్లిదండ్రుల కలిసి రైలులో తన స్వగ్రామం రాజంపేటకు బయలుదేరింది.