సొంత గడ్డకు చేరుకున్న నిఖత్ జరీన్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం పలికిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

By Siva KodatiFirst Published May 27, 2022, 4:47 PM IST
Highlights

టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఆమెకు స్వాగతం పలికారు. 

ఇటీవల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో (world boxing championships 2022) స్వర్ణ పతకం (gold medal) గెలిచిన తెలుగు తేజం నిఖత్ జరీన్ (nikhat zareen) సొంత గడ్డకు చేరుకున్నారు. శుక్రవారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు ఘనస్వాగతం లభించింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( srinivas goud), అధికారులు, కుటుంబ సభ్యులు నిఖత్ జరీన్‌కు స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్ట్‌లోనే ఆమెను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సత్కరించారు. 

కాగా.. ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య (ఐబీఏ) ఆధ్వర్యంలో  టర్కీ రాజధాని ఇస్తాంబుల్ వేదికగా ఆదివారం ముగిసిన మహిళల బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్స్ లో జరీన్.. 5-0 తేడాతో థాయ్‌లాండ్‌కు చెందిన జిట్పాంగ్ ను చిత్తుచిత్తుగా ఓడించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.  తద్వారా ఈ పతకం గెలిచిన తొలి తెలుగు, తెలంగాణ అమ్మాయిగా నిలిచింది. ఫైనల్ పోరు ఆరంభం నుంచి  ముగిసేవరకు ప్రత్యర్థికి ఏమాత్రం కూడా కోలుకునే అవకాశం ఇవ్వకుండా.. బలమైన పంచ్ లతో విరుచుకుపడింది. 

తెలంగాణ లోని ఇందూరు (నిజామాబాద్) కు చెందిన నిఖత్ జరీన్ ఇక్కడివరకు రావడానికి చాలా కష్టపడింది. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నిఖత్.. ఇందూరు నుంచి ఇస్తాంబుల్ చేరడానికి  పుష్కర కాలం కృషి దాగి ఉంది. ఆ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం. 

13 ఏండ్లకే తొలి పంచ్..

నిజామాబాద్ కు చెందిన మహ్మద్ జమీల్ అహ్మద్-పర్వీన్ సుల్తానాలకు కలిగిన నలుగురి సంతానంలో  మూడో అమ్మాయి జరీన్. జమీల్.. పొట్టకూటి కోసం గల్ఫ్ లో కొన్నాళ్లు సేల్స్ ఆఫీసర్ గా పని చేసి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. చిన్నప్పట్నుంచే బాక్సింగ్ మీద మక్కువ పెంచుకున్న జరీన్.. 13 ఏండ్లలో తన ఈడు పిల్లలంతా  వీధుల వెంబడి  ఆడుకోవడానికి వెళ్తే తాను మాత్రం చేతులకు బాక్సింగ్ గ్లౌజులు వేసుకుంది. 

Also Read:నిఖత్ జరీన్‌కు రూ.5 లక్షల నజరానా ప్రకటించిన రేవంత్ రెడ్డి.. వాళ్లలాగే ఈమెకు ఇవ్వండి, కేసీఆర్‌కు విజ్ఞప్తి

నిజామాబాద్ లోని షంసముద్దీన్ దగ్గర బాక్సింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టిన ఆరు నెలలకే  ఆమె తన ప్రతిభ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. 2010 లో కరీంనగర్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ లో  గోల్డ్ మెడల్ నెగ్గింది. కొద్దిరోజుల్లోనే ఆమె జాతీయ స్థాయిలో కూడా పలు టోర్నీలలో పతకాలు నెగ్గింది. తర్వాత ఆమె.. విశాఖపట్నంలోని ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐవీ రావు దగ్గర శిక్షణ తీసుకుంది. 2010లోనే  ఈరోడ్ (తమిళనాడు) లో జరిగిన  నేషనల్ ఛాంపియన్స్ లో ‘గోల్డెన్ బెస్ట్ బాక్సర్’ అవార్డు పొందింది. 

సాధించిన ఘనతలు.. 

- 2011 లో ఇదే టర్కీలో  ముగిసిన ఏఐబీఏ ఉమెన్స్ జూనియర్ అండ్ యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో ఆమె స్వర్ణం నెగ్గింది. 
- 2014లో యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్.. 
- 2015 లో అసోంలో ముగిసిన 16వ  సీనియర్ ఉమెన్  నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ లో  గోల్డ్ మెడల్. 
- 2019 లో బ్యాంకాక్ లో  జరిగిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ లో  సిల్వర్ మెడల్ 
- 2019, 2022  స్ట్రాంజ మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలలో స్వర్ణం. 

click me!