yearender2023: 2023లో జనాల కంటిమీద కునుకు లేకుండా చేసిన వ్యాధులు ఇవే..!

First Published Dec 17, 2023, 10:48 AM IST

yearender 2023: మరికొన్ని రోజుల్లో 2023 సంవత్సరానికి ముగింపు పలకబోతున్నాం. అందుకే ఈ ఇయర్ ఎండింగ్ సమయంలో ఏడాది పొడవునా జరిగిన సంఘటనలను జనాలు గుర్తుచేసుకుంటుంటారు. ఈ ఏడాది దాదాపు అన్ని రంగాల్లో ఏదో ఒకటి వార్తల్లో నిలిచింది. ఆరోగ్య రంగం కూడా వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది ఎన్నో వ్యాధులు జనాలను పట్టి పీడించాయి. వీటిలో జనాలను బాగా భయాందోళనకు గురి చేసిన కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పాత సంవత్సరానికి వీడ్కోలి పలికి.. కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పే సమయం మరికొన్ని రోజుల్లోనే ఉంది. ఇక పాత  సంవత్సరంలో ఆనందకరమైన విషయాల గురించి, భయానికి గురిచేసిన ఘటనల గురించి నెమరువేసుకుంటుంటారు ఈ సమయంలో. అందుకే ఈ ఏడాది మనల్ని పట్టిపీడించిన కొన్ని రకాల వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

కరోనా మహమ్మారి తర్వాత మళ్లీ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసిన వ్యాధులు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వ్యాధులు ఒక్క మనదేశంలోనే కాదూ ప్రపంచంలోనూ వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది చివరిలోగా భారత్ లో జనాలను బాగా భయపెట్టిన ఐదు వ్యాధులపై ఓ లుక్కేద్దాం పదండి.
 

dengue fever

డెంగ్యూ

డెంగ్యూ వ్యాధి దోమల వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధి అన్న సంగతి అందరికీ తెలుసు. ఇది కొన్ని సీజన్లలోనే ఎక్కువగా వస్తుంది. అయితే ప్రతి ఏడాది కంటే ఈ ఏడాదే దేశవ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదు కావడం వల్ల జనాలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అంతేకాదు భారత్ తో పాటుగా కొన్ని పొరుగు దేశాల్లో కూడా డెంగ్యూ బీభత్సం సృష్టించింది.
 

pink eye

కండ్లకలక

ఈ ఏడాది కండ్లకలక కేసులు కూడా జనాలను బాగా ఇబ్బంది పెట్టాయి. వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే కంటి ఇన్ఫెక్షన్ ఇది. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాదే కండ్లకలక కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఇది కూడా జనాలను ఎంతో భయపెట్టింది. 
 

Nifa virus

నిపా వైరస్

ఈ ఏడాది నిపా వైరస్ వ్యాప్తి కూడా జనాలను బాగా బయపెట్టింది. ఎక్కడ ఇది కూడా కరోనా వైరస్ లాగా వ్యాప్తిచెందుతుందోనని ఎంతో భయపడిపోయారు. కేరళలో ఈ వైరస్ నిర్ధారణ కావడంతో దేశవ్యాప్తంగా జనాలు తీవ్రభయాందోళనకు గురయ్యారు. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రాణాంతక వైరస్ నిఫా. ఇది ముఖ్యంగా గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది. వైరస్ బయటపడినప్పటి నుంచి అప్రమత్తత పెంచారు.
 

rabies

రేబిస్

ఈ ఏడాది రేబిస్ కూడా వార్తల్లో నిలిచింది. వాస్తవానికి ఘజియాబాద్ లో కుక్క కాటుకు గురై రేబిస్ వ్యాధితో 14 ఏండ్ల బాలుడు మృతి చెందడం అందరినీ కలచివేసింది. కుక్క కాటు వేయడంతో ఆ బాలుడు రేబిస్ వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడు. అయితే ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. ఈ బాలుడి విషయంలో కూడా అదే జరిగింది. ఇంట్లో వాళ్లకు బయపడి కుక్క కరిచిన విషయాన్ని చెప్పకపోవడంతోనే బాలుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

న్యుమోనియా

ఈ మధ్యకాలంలో కాలంలో చైనా సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో మిస్టీరియస్ న్యుమోనియా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అంతేకాదు వాకింగ్ న్యుమోనియా కేసులు భారతదేశంలోనే నమోదయ్యాయి. భారతదేశంలో నమోదైన ఈ కేసులకు చైనాలో వ్యాప్తి చెందుతున్న న్యుమోనియాతో ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ ఈ వ్యాధి కూడా కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. 
 

click me!