కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో స్కూళ్లు మూతబడటంతో చిన్నారులకు పొద్దుపోవడం లేదు. నేస్తాలు లేకపోవడం, 24 గంటలూ ఇంట్లో కూర్చొనే వుండటంతో పిల్లలకు విసుగొస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు అన్నాచెల్లెళ్లు ఓ డేంజర్ గేమ్ ఆడారు

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో స్కూళ్లు మూతబడటంతో చిన్నారులకు పొద్దుపోవడం లేదు. నేస్తాలు లేకపోవడం, 24 గంటలూ ఇంట్లో కూర్చొనే వుండటంతో పిల్లలకు విసుగొస్తోంది.

ఈ క్రమంలో ఇద్దరు అన్నాచెల్లెళ్లు ఓ డేంజర్ గేమ్ ఆడారు. ఏకంగా 23వ అంతస్థు చివరికి చేరుకుని ఎవరు ధైర్యవంతులో నిరూపించుకోవాలని బెట్ వేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని ఓ 14 ఏళ్ల బాలిక తన అన్నయ్య కలిసి ఏదైనా గేమ్ ఆడదామనుకున్నారు. దీనిలో భాగంగా ఎవరికి ఎక్కువ ధైర్యం ఉందో చూసుకుందామని పోటీ పెట్టుకున్నారు.

అన్నయ్య కన్నా తనే ఎక్కువ ధైర్యవంతురాలని నిరూపించుకునేందుకు గాను ఆ బాలిక మూడుసార్లు 23వ అంతస్థు చివరి వరకు నడిచింది. పిల్లల ఆటను కొందరు కెమెరాలో చిత్రీకరించి ఆన్‌లైన్‌లో పెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దీనిని చూసిన వారు ఏమాత్రం కాలు జారినా పిల్లల పరిస్థితేంటని కామెంట్ చేస్తున్నారు. ఇంతటి కలకలం రేపిన ఈ ఘటన ఆగస్టు 6న చెన్నైకి సమీపంలోని కేళంబక్కమ్‌లో చోటు చేసుకుంది. ఈ విషయం పోలీసులకు దృష్టికి చేరడంతో చిన్నారులిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు.