దురుసు పదజాలం వాడుతూ వల్లభనేని వంశీ అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని నందిగాం వేణుగోపాల స్వామి అన్నారు. ఇప్పటికైనా వంశీ తన తీరు మార్చుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.

విజయవాడ: గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ స్వామి తీరు మార్చుకోవాలని, అసభ్యపదాలు ఉపయోగించవద్దని కృష్ణా జిల్లా గొల్లపూడి అయ్యప్పస్వామి భక్త కమిటీ గురుస్వామి నందిగాం వేణుగోపాల స్వామి సలహా ఇచ్చారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దని ఆయన సూచించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

శరీరాన్ని , మనసును అదుపులో ఉంచుకొని సన్మార్గంలో పయనింపజేసేదే అయ్యప్ప మండల దీక్ష అని చెప్పారు. 41 రోజుల పాటు అయ్యప్పకు ఆత్మనివేదన చేసుకుంటూ నిత్యశరణు ఘోషతో భక్తులు పూజిస్తారని, మనసారా అయ్యప్పస్వామిని కొలవడమే ఈ దీక్ష పరమార్థమని చెప్పారు. 

Also Read: జూ.ఎన్టీఆర్ ను తేవాలన్నప్పుడు అడిగామా: లోకేష్, బాబులను ఏకేసిన వంశీ

రోజులో ఒకసారి భిక్ష . . మరోసారి అల్పాహారం . . రెండుసార్లు చన్నీటి స్నానం . . నేలపై నిద్రించాలనే కఠిన నియమాలతోరణమే ఈ దీక్ష ప్రాధాన్యమని అన్నారు. అటువంటి దీక్ష చేపట్టిన వల్లభనేని వంశీ అందుకు పూర్తి విరుద్ధంగా పరుష పదజాలంతో మాట్లాడటం సరికాదని అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వంశీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 

అయ్యప్ప భక్తులకు వల్లభనేని వంశీ కళంకంగా మారారని, ప్రపంచ వ్యాప్తంగా తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని అన్నారు. స్వామి వారి దుస్తులు ధరించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వేణుగోపాల స్వామి అన్నారు. ఇప్పటికైనా వంశీ ఆయన తీరు మార్చుకోలాసని, అయ్యప్ప భక్తులు స్వామి వారి పట్ల అచెంచలమైన భక్తితో దీక్షలు చేపడతారని అన్నారు. 

Also Read: అయ్యప్ప మాలలో వంశీ తిట్లు.. హిందూ మతంపై జగన్ దాడే: దేవినేని ఉమ

స్వామి వారి అనుగ్రహం కోసం కోటాను కోట్ల మంది భక్తులు రాగద్వేషాలు , ఆహారనియమాలు, నడవడికను పూర్తిగా మార్చుకొని ఆ అయ్యప్పను అరాధిస్తారని అన్నారు. అటువంటి మాలధారణ చేసిన వంశీ విరుద్ధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, నియంత్రణ కోల్పోయి, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం భావ్యం కాదని అన్నారు.

మాలధరణలో ఉన్న సమయంలో రాజకీయాలు మానుకోవాలని, ఇప్పటికైనా వంశీ తీరుమార్చుకొని భక్తుల ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నామని అన్నారు. నియమాలతో దీక్షను నిర్వహించాలని కోరుతున్నామని అన్నారు.