Asianet News TeluguAsianet News Telugu

అమరావతిలో పోలీస్ కాల్పులు... చంద్రబాబు ప్రయత్నమదే: బొత్స సంచలనం

అమరావతి ప్రాంతంలో రాజధాని నిరసనల పేరుతో  హింసాత్మక వాతావరణాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. 

chandrababu plans to create violense at amaravati: botsa satyanarayana
Author
Vijayawada, First Published Jan 9, 2020, 4:15 PM IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. రాజధాని ప్రాంతంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవాలని... ముఖ్యంగా నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపే విధంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అయితే పోలీసులు సంయమనంతో వుండటం వల్ల ఆ ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయని మంత్రి వెల్లడించారు.

 చంద్రబాబు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని కాల్పులు జరగాల కోరుకోవడం దారుణమన్నారు. ఇలా జరిగితే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చి తమ పార్టీకి లబ్ది చేకూరుతుందని ఆయన భావిస్తున్నట్లున్నారు కానీ సామాన్యుల ప్రాణాలను లెక్కచేయడం లేదంటూ బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. 

గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా అమ్మఒడి కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం అమలు చేస్తోందని బొత్స ప్రశంసించారు. ఏడు నెలల కాలంలో డజనుకు పైగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు  ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అమలు చేస్తోంటే కొందరు కావాలనే తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

read more పార్టీ కోసం ప్రభుత్వ నిర్ణయాన్నే జగన్ తుంగలో తొక్కాడు...: యనమల

రాజధాని కోసం కేవలం రూ. 3వేల కోట్లు ఖర్చు పెడితే సరిపోతుందంటూ చంద్రబాబు చెబుతున్నారని... కానీ వాస్తవానికి పరిస్థితి అలా లేదన్నారు. పూర్తిస్థాయిలో అమరావతి రాజధాని నిర్మాణం జరగాలంటే చాలా ధనం ఖర్చవుందని... అందువల్లే సీఎం జగన్ రాజధాని మార్పు నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

రాష్ట్రంంలోని ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. రైతుల గురించి టీడీపీ చేసిన ఒక్క మంచి పని ఏంటో చెప్పాలని మంత్రి నిలదీశారు. వైఎస్ స్ఫూర్తితో వచ్చిన ప్రభుత్వం తమదన్నారు. వైఎస్ తెచ్చిన ఉచిత విద్యుత్ పథకం దేశానికే ఆదర్శంగా మారిందని...ఈ  ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని అన్నారు.

అమరావతిలో ప్రస్తుతమున్న ప్రభుత్వ భవనాలన్నీ తాత్కాలికమైనవేనని అన్నారు. శాశ్వత భవనాలకు మనవడితో కలిసి శంకుస్థాపన ఎందుకు చేశారో చెప్పాలని మాజీ సీఎం చంద్రబాబును బొత్స ప్రశ్నించారు. 

ఆంబోతు ప్రభుత్వం అంటూ తమ సర్కార్ పై లోకేష్ కామెంట్లు చేయడం సరికాదన్నారు.  లోకేష్ కంటే ఆంబోతు ఎవరూ వుండరని విమర్శించారు. గత ప్రభుత్వం రాజధాని రైతులకు ఇచ్చిన కమిట్మెంటును తూచా తప్పకుండా నెరవేరుస్తామన్నారు. రాజధాని రైతుల ఆలోచనల్లో ఏమైనా మార్పు వస్తే ప్రభుత్వానికి చెప్పాలని బొత్స కోరారు. అమరావతి ప్రాంతం అభివృద్ధి విషయంలో  తమ ప్రణాళికలు తమకున్నాయి... ఏ విధంగా అభివృద్ధి చేస్తామో చూడాలన్నారు.

read more  మహిళల్ని అర్థరాత్రి జైలుకు తరలించి...: పోలీస్ ఆగడాలపై కళా వెంకట్రావు సీరియస్

రాయలసీమ వాసులు రాజధాని అడగడంలో తప్పు లేదన్నారు. కానీ ఆ ప్రాంతానికి కరవు నివారణ చర్యలు మరింత అవసరమని పేర్కొన్నారు. నీటి సమస్యను అధిగమించడమే రాయలసీమకు అత్యంత అవసరమన్నారు.

మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గత ఐదేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. ఆ సమయంలో సుజల స్రవంతి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అశోక్ తన తాతల పేరు చెప్పి నాయకుడయ్యారని ఎద్దేవా చేశారు. 

రాజధాని విషయంలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కు అసలు క్లారిటీ ఉందా..? అని ప్రశ్నించారు. రాజధానిపై స్పష్టత ఎవరికి ఇవ్వాలి..? ఎన్నిసార్లు ఇవ్వాలి...  పవన్ ఇంటికెళ్లి స్పష్టత ఇవ్వాలా..?అంటూ బొత్స మండిపడ్డారు. పవన్ ప్రతి నెలా కవాతు అంటారు.. తొడలు కొడతారు అది సర్వసాధరణమే అని బొత్స పేర్కొన్నారు. 

రాజధాని రైతులకు ఇవ్వాల్సివ రిటర్నఏంబుల్ ప్లాట్లను అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. రైతులకు చిన్న గాయమైతే తమకు పెద్ద దెబ్బ తగిలినట్టు భావిస్తామని.... అలాంటిది వారికెలా అన్యాయం చేస్తామన్నారు. సెక్రటేరీయేట్ వేరే ప్రాంతానికి వెళ్తే వచ్చే నష్టమేంటో చెప్పాలని బొత్స అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios