Asianet News TeluguAsianet News Telugu

సింగరేణిలో మోగిన సమ్మె సైరన్‌.. ఈరోజు నుండి 3 రోజుల పాటు..

బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. ఈ ఉదయం షిఫ్ట్ నుంచి అన్ని గనుల్లో సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోంది. 

బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. ఈ ఉదయం షిఫ్ట్ నుంచి అన్ని గనుల్లో సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోంది. అటు ఇతర రాష్ట్రాల్లోని కోల్ ఇండియా గనుల్లోనూ 72 గంటల సమ్మె ప్రారంభమైంది. ఆత్మ నిర్భర భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటు వారికి అప్పగించేందుకు నిర్ణయించడం, వేలం ప్రక్రియ కూడా చేపట్టడంతో జాతీయ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్త మూడు రోజుల సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం ఉదయం సింగరేణిలోనూ కార్మికుల సమ్మె ప్రారంభమైంది. సింగరేణి విస్తరించి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం నుంచి మొదలు కొమురంభీం జిల్లా వరకు ఉన్న అన్ని భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే కరోనాతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సింగరేణికి 3 రోజుల సమ్మె మరింత భారం అవుతుందని యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సమ్మెలో పాల్గొనవద్దని జాతీయ సంఘాల నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు.