తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఫైరయ్యారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని.. టీఆర్ఎస్ నేతల అరాచకాలకు రామాయంపేటలో తల్లీకొడుకులు ఆత్మహత్య చేసుకున్నారని షర్మిల ఆరోపించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్పై (kcr) వైఎస్సార్ తెలంగాణ పార్టీ (ysrtp) అధినేత్రి వైఎస్ షర్మిల (ys sharmila) మండిపడ్డారు. మంగళవారం వరుస ట్వీట్లు చేసిన ఆమె.. ''సింగరేణిని కేసీఆర్ దివాలా తీసిండు. రూ.3 వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న సంస్థను రూ.8 వేల కోట్ల అప్పులపాలు జేసిండు. 60 వేల మంది కార్మికులతో కళకళలాడే సింగరేణి.. నేడు 40 వేల మందికి తగ్గిపోయింది. సింగరేణి ఆస్తుల్ని కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నడు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి కేసీఆర్ నోరెత్తలె. టీఆర్ఎస్ అరాచకాలు తట్టుకోలేక తల్లీకొడుకులు ఒళ్లు కాల్చుకున్నారంటే దానికి కారణం కేసీఆర్. కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు మహిళల మానప్రాణాలు తీసి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నడు. కమీషన్లు, లంచాలతో పాటు ఆడవాళ్ల మానం కూడా అడుగుతున్నారంటే వాళ్లు మనుషులా?మృగాలా?
రాష్ట్రంలో రౌడీల రాజ్యం, గూండాల రాజ్యం నడుస్తోంది. కబ్జాలు, సెటిల్మెంట్లకు తోడు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పిస్తున్నరు. కేసీఆర్కు తెలిసిందల్లా గారడి మాటలు, గలీజు తిట్లు. ఎన్నికలు రాగానే దొంగ మాటలు చెప్పడం, ఓట్లు వేయించుకోవడం, ఫామ్ హౌస్కు వెళ్లిపోవడం. ఇదే జరుగుతోంది'' అని షర్మిల ట్వీట్లు చేశారు.
మరోవైపు.. అభిమానుల మధ్య తన తల్లి వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు (ys vijayamma birthday) ఘనంగా నిర్వహించారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విజయమ్మకు షర్మిల తినిపించారు. మంగళవారం లక్ష్మీదేవిపల్లిలో వైఎస్ షర్మిల పాదయాత్ర క్యాంపు వద్ద వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అటు కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగుతోంది. ఈ క్రమంలో లక్ష్మీదేవిపల్లి మండలం రేగుళ్లలో నిరుద్యోగ నిరాహార దీక్షలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు.
