మందకృష్ణను పరామర్శించిన వైఎస్ షర్మిల.. దళిత భేరి సభకు రావాలని ఆహ్వానం
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం కలిశారు. ఈ క్రమంలోనే పలు అంశాలు వారిద్దరూ చర్చించారు. దళితుల పక్షాన చేస్తున్న పోరాటానికి మద్ధతుగా నిలవాలని మందకృష్ణ.. షర్మిలను కోరారు.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఇటీవల బాత్రూంలో కాలు జారి పడడంతో బోన్ ఫ్రాక్చర్ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన కొద్దిరోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం కలిశారు. ఈ క్రమంలోనే పలు అంశాలు వారిద్దరూ చర్చించారు. దళితుల పక్షాన చేస్తున్న పోరాటానికి మద్ధతుగా నిలవాలని మందకృష్ణ.. షర్మిలను కోరారు. అలాగే మందకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఫొటో పోస్ట్ చేశారు.
'ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మంద కృష్ణ మాదిగ గారిని ఈ రోజు తన నివాసంలో కలసి పరామర్శించడం జరిగింది. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాను. అలాగే, సెప్టెంబరు 12న వైఎస్సార్ తెలంగాణ పార్టీ తిరుమలగిరిలో నిర్వహించే "దళిత భేరి" బహిరంగ సభకు ఆయనను ఆహ్వానించాను' అని షర్మిల తెలిపారు.