మహిళా రిజర్వేషన్ల కోసం భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరాహర దీక్ష చేస్తానని అనడంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సెటైర్లు విసిరారు.
హైదరాబాద్ :మహిళా రిజర్వేషన్ సాధనకు ఈ నెల 10న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షకు దిగనున్నట్లు సీఎం కేసీఆర్ కూతురు, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. భారత జాగృతి ఆధ్వర్యంలో చేపట్టే ఈ దీక్షపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సెటైర్లు విసిరారు.తెలంగాణలో రెండుసార్లు అధికారంలో వున్న బిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు. ఇందుకోసం కవిత నిరాహార దీక్ష చేస్తానని అనడం బంగారం పోయిందని దొంగలే ధర్నా చేసినట్లు వుందని షర్మిల ఎద్దేవా చేసారు.
ఎక్కడ తాను చేసిన లిక్కర్ స్కామ్ గురించి ప్రజలందరికీ తెలిసిపోతుందోనని కవిత భయపడుతున్నారని... అందువల్లే ప్రజలను, మీడియాను పక్కదారిపట్టించేందుకే మహిళా రిజర్వేషన్లంటూ కొత్తరాగం అందుకున్నారని షర్మిల పేర్కొన్నారు.రెండుసార్లు అధికారంలోకి వచ్చిన మీరు రాష్ట్రంలో మహిళలకు 33% సీట్లు ఎందుకు కేటాయించలేదు? అని షర్మిల ప్రశ్నించారు.లిక్కర్ స్కాం పై వరుస అరెస్టులు, విచారణ వేగవంతం నేపథ్యంలో దృష్టి మరల్చడానికే మహిళా రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారని షర్మిల అన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన మొదటిసారి 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మహిళలకు కేటాయించింది రెండే సీట్లు... అంటే కేవలం 11.76శాతమేనని షర్మిల గుర్తుచేసారు.అప్పటి మంత్రివర్గంలో మహిళలకు అసలు స్థానమే లేదు... ఇదేనా మహిళలపై మీకున్న ప్రేమ? అని షర్మిల నిలదీసారు.
Read More మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఈ నెల 10న న్యూఢిల్లీలో దీక్ష: కవిత
రెండోసారి 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదు... క్యాబినెట్ లోనూ పట్టుమని ఇద్దరు మహిళా మంత్రులు వున్నారని షర్మిల అన్నారు. రాజకీయాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం కాదు రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడంలో మీ తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు వచ్చిన అడ్డంకి ఏంటి? అని కవితను షర్మిల ప్రశ్నించారు.
''మీరు దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు ప్రగతిభవన్ ముందు... ఫామ్ హౌజ్ ముందు. బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్ కు పాల్పడిన మీరు, మహిళలకే తలవంపు తెచ్చారు. ఇప్పుడు ఆ స్కాంను పక్కదారి పట్టించేందుకే ఈ కొత్త డ్రామాలు'' అంటూ కవితపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
