రేపు ఉదయం ధర్నా చౌక్ దగ్గర వైఎస్ షర్మిల.. ‘రైతు వేదన’ నిరాహార దీక్ష
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రేపు ఉదయం ధర్నా చౌక్ దగ్గర రైతు వేదన నిరాహార దీక్ష చేపట్టడానికి నిర్ణయించింది. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరాహర దీక్ష చేపట్టనున్నారు. ఆ తర్వాత మిగతా 48 గంటలపాటు లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో రైతు వేదన దీక్ష కొనసాగించనున్నారు.
హైదరాబాద్: Telanganaలో వరి పంటపై రాజకీయం జోరుగా నడుస్తున్నది. వరి ధాన్యాన్ని(Paddy) కేంద్ర ప్రభుత్వం సేకరించబోమని అంటున్నదని, పంజాబ్ తరహాలోనే తెలంగాణలోనూ పంటను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. ఇదే అంశం ప్రధానంగా రాష్ట్రం వర్సెస్ కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయి. ధాన్యం కొనుగోలు చేయాలని CM KCR లేఖ రాస్తే తాము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని రాష్ట్ర బీజేపీ సమాధానం ఇస్తున్నది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయాలతో రైతు నష్టపోతున్నాడని కాంగ్రెస్ వాదిస్తున్నది. రైతు గోసే తమకు ముఖ్యమని మాట్లాడుతున్నది. ఇదిలా ఉండగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రేపు నిరాహర దీక్షకు ప్లాన్ చేసింది.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సారథ్యంలో రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇందిరాపార్క్ సమీపంలోని ధర్నా చౌక్ దగ్గర రైతు వేదన నిరాహర దీక్ష జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతు వేదన దీక్ష చేపట్టనున్నారు. మిగతా 48 గంటలు లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో రైతు వేదన దీక్ష కొనసాగించనున్నారు. ఈ నిరాహార దీక్షకు పార్టీ అధికార ప్రతినిధులు, పార్లమెంటు కన్వీనర్లు, కో కన్వీనర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, యువజన విభాగం, దళిత, బీసీ, మైనారిటీ, గిరిజన విభాగం నాయకులు పార్టీ నేతలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు.
Also Read: 'వరి' అస్త్రం: కేంద్రంపై యుద్ధానికి కేసీఆర్ 'సై '
యాసంగిలో వరి పంట వేయవద్దని, ఇతర పంటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కోరింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కేంద్రం వరి ధాన్యం సేకరించబోమని చెబుతున్నదని, కాబట్టే వరి పంట వేస్తే నష్టపోవాల్సి వస్తుందనే ముందు జాగ్రత్తతోనే వరి వద్దని చెప్పినట్టు వివరించారు. తమ ప్రభుత్వమే రైతుల కోసం ఎన్నో కీలక పథకాలను చేపట్టిందని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రం పై పోరాడతామని ప్రకటించారు.