నేటి నుంచి వైెఎస్ శర్మిల ‘రైతు ఆవేదన యాత్ర’
ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించడానికి వైెఎస్ శర్మిల యాత్ర చేపట్టనున్నారు. రైతు ఆవేదన పేరుతో సాగే ఈ యాత్ర మెదక్ జిల్లాలో ప్రారంభం కానుంది.
తెలంగాణ రాష్ట్రంలో మరో పార్టీ యాత్ర మొదలుపెట్టనుంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో, ఆ పార్టీ అధినాయకురాలు వైఎస్ శర్మిల ‘రైతు ఆవేదన యాత్ర’ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన కార్యచరణ, రూట్ మ్యాప్ ను ఐదు రోజుల క్రితమే విడుదల చేశారు. మొదటి రోజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకర్గం, ఆందోల్ నియోజకవర్గంలోని ఈ యాత్ర ప్రారంభం కానుంది. నర్సాపూర్ లోని కంచనపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను వైఎస్ శర్మిల ఓదార్చనున్నారు. తరువాత వరసుగా జిల్లాలో ఆమె యాత్ర చేయనున్నారు.
రైతు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా యాత్ర..
ఈ రైతు ఆవేదన యాత్ర ద్వారా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు వైఎస్ శర్మిల. రైతులను తెలంగాణ ప్రభుత్వం చిన్నచూపుచూస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్య పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 70 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రైతులెవరూ ఆత్మహత్య చేసుకోకూడదని విజ్ఞప్తి చేశారు.ఆత్మహత్య చేసుకున్న రైతుల ఇంటింటికీ వెళ్లి పరామర్శిస్తానని చెప్పారు. తమ పార్టీ రైతు పక్షాన నిలబడుతుందని తెలిపారు. రైతులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే తాను యాత్ర చేపడుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న ప్రతీ రైతు కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం చెల్పించాలని డిమాండ్ చేశారు.
ఇంటర్ స్టూడెంట్ల విషయంలో ఏం చేద్దాం.. తెలంగాణ సీఎంవో సమాలోచనలు..
త్వరలో ‘ప్రజాప్రస్థానం’ యాత్ర పున:ప్రారంభం
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ‘ప్రజాప్రస్థానం’ యాత్ర మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు కోడ్ ముగియడంతో ఆ యాత్రను త్వరలోనే మళ్లీ ప్రారంభిస్తామని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వైఎస్ శర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన నాటి నుంచి దాని బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే పలు జిల్లాలో సభలు నిర్వహించారు. తన కలిసి నడిచే నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ కు దూరంగా ఉండే నాయకులను కలుపుకుపోతున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా ఆక్టోబర్ 20వ తేదీ నుంచి ‘ప్రజా ప్రస్థానం’ పేరిట యాత్ర చేపట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చిన పాదయాత్ర చేపట్టిన చేవెళ్ల ప్రాంతం నుంచే శర్మిల కూడా పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ యాత్ర చేవెళ్లలోనే ముగియాల్సి ఉండగా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయింది. ఇప్పుడు రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా మళ్లీ యాత్ర చేపట్టనున్నారు. ఇటీవలే వరి కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఆమె ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆమె రైతు ఆవేదన యాత్ర చేపడుతున్నారు.
వైఎస్ శర్మిల తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ స్థాపించిన నాటి నుంచి దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు దగ్గరవడానికి యాత్రలు చేస్తున్నారు. మొన్నటి వరకు ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో యాత్ర చేపట్టారు. దాని కంటే ముందు తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై నిరసనలు చేపట్టారు. వరి కొనుగోలు విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో వరి కుప్పలపైనే పలువురు రైతులు చనిపోయారు. మరి కొందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిని పరామర్శించడానికి వైఎస్ శర్మిల ఇప్పుడు ఈ యాత్ర చేపడుతున్నారు. పలు జిల్లాల గుండే సాగే ఈ యాత్రలో ప్రభుత్వంపై శర్మిల విమర్శలు చేయనున్నారు.