ఓ యువకుడు బస్టాప్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంటనే సీపీఆర్ చేశాడు. దీంతో ఆ యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. 

హైదరాబాద్ : హైదరాబాదులో యువకులు కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఓ యువకుడు జిమ్ లో వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి గుండెపోటుతో మరణించిన ఘటన జరిగిన తెల్లారే.. అలాంటి మరో ఘటన హైదరాబాదులోనే చోటుచేసుకుంది. శుక్రవారం నాడు బస్ స్టాప్ లో నిలుచున్న ఓ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ అధిగమించి ఆ యువకుడికి సిపిఆర్ చేశాడు, దీంతో ఆ యువకుడు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు.

ఈ ఘటన హైదరాబాదులోని రాజేంద్రనగర్ సర్కిల్ ఆరాంఘర్ చౌరస్తాలోని ఓ బస్ స్టాప్ లో చోటుచేసుకుంది. బస్టాప్ లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ యువకుడు ఉన్నట్టుండి కింద పడిపోయాడు. ఆ యువకుడు అలా పడిపోవడాన్ని అక్కడే ట్రాఫిక్ విధుల్లో ఉన్న రాజశేఖర్ అనే కానిస్టేబుల్ గమనించాడు. వెంటనే యువకుడి దగ్గరకు పరిగెత్తి సిపీఆర్ చేశాడు. సమయానికి కానిస్టేబుల్ స్పందించడంతో ఆ యువకుడు స్పృహలోకి వచ్చాడు. వెంటనే అతడిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.

దీనిమీద ట్రాఫిక్ సిఐ శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం బాధితుడు పూర్తిగా కోరుకున్నాడని తెలిపారు. యువకుడిని చూసి సకాలంలో స్పందించిన కానిస్టేబుల్ రాజశేఖర్ ను పోలీసు అధికారులు అభినందించారు. 

విషాదం.. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి.. జిమ్ లో వ్యాయామం చేస్తూ.. ఉన్నట్టుండి కుప్పకూలి..

ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. 24 సంవత్సరాల ఓ యువ పోలీస్ జిమ్ లో కసరత్తులు చేస్తూ హఠాత్తుగా గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన జిమ్ సిబ్బంది అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లుగా ధ్రువీకరించారు. చనిపోయిన కానిస్టేబుల్ పేరు విశాల్. బోయిన్పల్లికి చెందిన వ్యక్తి. 2020 బ్యాచ్ కానిస్టేబుల్. ప్రస్తుతం ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

చిన్న వయసులోనే ఉద్యోగం పొందాడు. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చింది. తనకెంతో ఇష్టమైన పోలీస్ శాఖలో ఉద్యోగం రావడంతో జీవితంలో స్థిరపడ్డాడు. అంతలోనే 24 యేళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఆరోగ్యం మీద ఎంతో శ్రద్ధతో నిత్యం వ్యాయామం, జిమ్ చేస్తూ ఉండేవాడు. గుండెనొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణించడం.. అంతా సెకండ్లలో జరిగిపోవడం అందరిని కలచివేసింది.

ఇటీవలి కాలంలో ఇలాంటి మరణాలు ఎక్కువ అవుతుండడంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఈ మధ్య హీరో నందమూరి తారకరత్న, కొంతకాలం క్రితం కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ కూడా ఇలాగే మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ రాజకుమార్ కూడా జిమ్ లో వ్యాయామం చేస్తూనే గుండెపోటుకు గురికావడం తెలిసిందే.