కేవలం రూ.600 కోసం అభాండాలు... భరించలేక బాలిక సూసైడ్
దొంగతనం నింద వేయడంతో మనస్థాపంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

నిజామాబాద్ : దొంగతనం చేసినట్లు అనుమానించడాన్ని ఆ బాలిక అవమానంగా భావించింది. పదే పదే నువ్వే దొంగతనం చేసావంటూ నిందలు వేయడాన్ని తట్టుకోలేకపోయింది. చేయని తప్పుకు మాటలు పడటంతో బాలిక తీవ్ర మనస్థాపానికి గురయ్యింది. ఇలా కేవలం రూ.600 వందల దొంగిలించిందన్న నింద ఓ బాలిక నిండు ప్రాణాలు బలితీసుకుంది.
బాలిక తల్లిదండ్రులు, పోలీసుల కధనం ప్రకారం... నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం శివతాండ గ్రామంలో వందన అనే బాలిక తల్లిదండ్రులతో కలిసి నివాసముంటోంది.వేసవి సెలవులు కావవడంతో బాలిక ఇంటివద్దే వుంటోంది. అయితే ఇటీవల ఇంటివద్ద ఒంటరిగా వున్న బాలిక తల్లితో మాట్లాడేందుకు పక్కింట్లో వుండే ప్రవీణ్ ఫోన్ తీసుకుంది. కొద్దిసేపు తల్లితో మాట్లాడిన తర్వాత అతడి ఫోన్ తిరిగి ఇచ్చేసింది.
అయితే ప్రవీణ్ మొబైల్ బ్యాక్ కవర్ లో రూ.600 దాచుకోగా అవి కనిపించలేదు... దీంతో తల్లితో మాట్లాడేందుకు ఫోన్ తీసుకున్న వందనే తీసిందని అనుమానించాడు. ఇదే విషయం బాలికను అడగ్గా తాను తీయలేదని చెప్పింది. అయినప్పటికీ వందననే అనుమానిస్తూ ప్రవీణ్ తో పాటు అతడి తల్లి కూడా దొంగతనం నింద వేసారు. ఎంతచెప్పినా వినిపించుకోకుండా చుట్టుపక్కల ఇళ్ళవారికి వందన దొంగతనం చేసిందంటూ చెప్పసాగారు. దీంతో అందరూ తనను దొంగలా చూడటం... ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం బాలిక భరించలేకపోయింది.
Read More ప్రేమించి పెళ్లి చేసుకుని.. వేరు కాపురం పెట్టిన.. మూడు నెలలకే యువకుడు ఆత్మహత్య..
చేయని తప్పుకు దొంగలా నింద వేయడం భరించలేక వందన ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుంది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూతురు ఉరేసుకున్నట్లు గుర్తించారు. కానీ అప్పటికే వందన ప్రాణాలు కోల్పోయింది.
మృతురాలి తల్లిదండ్రులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వందన మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. తమ కూతురు ఆత్మహత్యకు పక్కింటి ప్రవీణ్ తో పాటు అతడి తల్లి బులిభాయ్ కారణమని వందన తల్లిదండ్రులు ఫిర్యాదు చేసారు. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నవీపేట పోలీసులు.