పదో తరగతి పరీక్షా కేంద్రాల తనిఖీకి వెళ్లిన రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ కు విచిత్ర అనుభవం ఎదురయ్యింది. ఓ మహిళా కానిస్టేబుల్ ఆయనను మొబైల్ తో పరీక్షా కేంద్రంలోకి వెళ్లకుండా అడ్డుకుంది.
హైదరాబాద్ : పదోతరగతి పరీక్షా పేపర్ల లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు జరుగుతున్న ఇంగ్లీష్ పరీక్షకు మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పరీక్షల నిర్వహణను రాచకొండ సీపీ చౌహాన్ తనిఖీ చేశారు. ఎల్బీ నగర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయడానికి సీపీ చౌహాన్ వెళ్లారు. ఆ సమయలో ఆయన చేతిలో మొబైల్ ఫోన్ తో పరీక్షా కేంద్రంలోకి వెడుతున్నారు. దీనికి అక్కడ విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ అడ్డు చెప్పారు.
దీంతో అక్కడున్నవారంతా షాక్ కు గురయ్యారు. ఉన్నతాధికారిని అలా ఆపడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. కానీ ఆ మహిళా కానిస్టేబుల్ తన విధుల్లో భాగంగానే అలా చేసిందని అర్థం చేసుకున్న రాచకొండ సీపీ.. మొబైల్ ఫోన్ ను ఆ మహిళా కానిస్టేబుల్ కే ఇచ్చి పరీక్షా కేంద్రాల తనిఖీకి వెళ్లారు. సీపీ చౌహాన్ ఆ తరువాత ఆమెను అభినందించి, విధి నిర్వహణలో భాగంగా సిన్సియారిటీ కనబరిచినందుకు రివార్డును అందజేశారు.
పదో తరగతి ఇంగ్లీష్ ఎగ్జామ్ నేడు.. 2,652 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్స్.. భద్రత మరింత కట్టుదిట్టం..
ఇదిలా ఉండగా, వరుసగా రెండు పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలు పరీక్ష అయిపోకముందే వాట్స్అప్ ద్వారా బయటికి రావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్న 2,652 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్స్ ని నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే పోలీస్, పంచాయతీరాజ్, రెవెన్యూ సిబ్బందిని కూడా పరీక్షల పర్యవేక్షణకు వినియోగించాలని నిర్ణయించింది. ఈరోజు పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు జరగబోయే ఇంగ్లీష్ ఎగ్జామ్ తో పాటు మిగిలిన ఎగ్జామ్స్ కు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, పర్యవేక్షణ పెంచాలని ఎస్పీలు, కలెక్టర్లు తమ పరిధిలో ఉన్న పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లో కాపీయింగ్ ను నిరోధించడానికి ఇప్పటివరకు ఫ్లయింగ్ స్క్వాడ్లను మాత్రమే నియమిస్తున్నారు. కానీ, ప్రతి కేంద్రంలోనూ సిట్టింగ్స్ స్క్వాడ్స్ ను నియమించడం ఇదే మొదటిసారి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 4.94 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరికోసం 2,652 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 34,500 మంది ఇన్విజిలేటర్లుగా పరీక్షల విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో సమస్యాత్మక కేంద్రాలుగా 318 పరీక్ష కేంద్రాలను గుర్తించారు. ఈ కేంద్రాల్లోనే నిన్నటిదాకా సిట్టింగ్స్ స్క్వాడ్ లను నియమించారు.
అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. మిగిలిన 2,334 కేంద్రాల్లో కూడా సిట్టింగ్ స్క్వాడ్లను నియమిస్తున్నారు. దీనికోసం ఎంపీడీవోలు, డిప్యూటీ తహసిల్దార్లు, పోలీస్ అధికారులు, తహసీల్దారులను వినియోగించుకుంటున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా ఈ సిట్టింగ్ స్క్వాడ్లు ఇద్దరు చొప్పున ఉంటారు. పరీక్ష ముగిసే వరకు ఈ అధికారులు కేంద్రంలోనే ఉంటారు. దీంతోపాటు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు పహారానూ పెంచుతున్నారు. ఇక పరీక్షా కేంద్రాల దగ్గర విధుల్లో ఉండే ఏఎన్ఎంలు, పోలీసు సిబ్బంది కూడా సెల్ ఫోన్లు వాడద్దని నిషేధం విధించారు. ఇన్విజిలేటర్లను కూడా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపాలని అధికారులు స్పష్టం చేశారు.
