భార్య చేతిలో భర్త హతం: కారణం ఇదే..
ఓ మహిళ తన భర్తను మట్టుబెట్టింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నక్రేకల్: ఓ మహిళ తన భర్తను మట్టుబెట్టింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కొత్తపల్లి వెంకన్న(40) ఈనెల 15న రాత్రి మరణించాడు.
బంధువులు సహజమరణంగా గ్రామంలోని సబ్స్టేషన్ సమీపంలో 16న అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం గ్రామంలో చిన్నకర్మ జరిపేందుకు వచ్చిన మృతుడి బంధువులు అనుమానంతో వెంకన్న భార్య స్వర్ణను గట్టిగా నిలదీశారు.
దీంతో తానే గొంతు పిసికి చంపానని అంగీకరించింది. ఆ తర్వాత మృతుడి తమ్ముడు కొత్తపల్లి శ్రీను పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తహసీల్దార్ తిరందాసు వెంకటేశం, శాలిగౌరారం రూరల్ సీఐ క్యాస్ట్రోరెడ్డి, నకిరేకల్ ప్రభుత్వ వైద్యాధికారి శ్మశాన వాటిక వద్దకు వెళ్లి శవాన్ని వెలికితీసి పోస్ట్మార్టం నిర్వహించారు.
సీఐ స్వర్ణను విచారించగా అసలు విషయం తెలిసింది. తన భర్త ప్రతి రోజూ మద్యం తాగివచ్చి వేధించేవాడని, కుటుంబ పోషణ పట్టించుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడని, దాంతో విసిగెత్తి గొంతు నులిమి చంపానని ఆమె విచారణలో తెలిపింది.