కాంగ్రెస్ జెండా మోసేవారికే న్యాయం, కార్యకర్తల పార్టీ: ఇంద్రవెల్లిలో రేవంత్
కాంగ్రెస్ పార్టీ ఇక నుండి కార్యకర్తల పార్టీగా మారనుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇంద్రవెల్లి సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. పార్టీ జెండా మోసేవారికే పార్టీలో ప్రాధాన్యత ఇస్తామన్నారు.
ఆదిలాబాద్: రాబోయే సోనియా రాజ్యంలో కాంగ్రెస్ జెండా మోసేవారికే న్యాయం జరుగుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం నాడు ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ దళిత గిరిజన దండోరా సభను నిర్వహించింది. ఈ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఇక నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ అని ఆయన తేల్చి చెప్పారు. రానున్న 20 నెలల పాటు పార్టీ కోసం పనిచేసే పార్టీ కార్యకర్తలను తాను గుండెల్లో పెట్టుకొని కాపాడుకొంటానని ఆయన హామీ ఇచ్చారు.
also read:పంచె కట్టుకొన్నాడని డిప్యూటీ సీఎంను పదవి నుండి తప్పించారు: కేసీఆర్పై రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ కార్యకర్తల పార్టీగా మారుతుందని ఆయన తీర్మానం చేస్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ ఈ తీర్మానానికి మద్దతివ్వాలని ఆయన కోరారు. ప్రజలు ఆశీర్వదిస్తే తెలంగాణలో సోనియా రాజ్యం వస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలోనే మంచి జరిగిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సోనియమ్మ రాజ్యం వస్తోందన్నారు.
తెలంగాణ తల్లిని ఎవరైనా చూశారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధే తెలంగాణ తల్లి అని ఆయన చెప్పారు.ఎన్నో కష్టాలను ఓర్చి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు.టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు, కూతురు, బంధువు కొడుకులకు పదవులు దక్కాయన్నారు. రావుల రాజ్యం పోయి బడుగు, బలహీనవర్గాల రాజ్యం రావాలన్నారు. ఈ రాజ్యం ఎవరో ఇస్తే రాదని దాన్ని మనమే గుంజుకోవాలన్నారు.