పంచె కట్టుకొన్నాడని డిప్యూటీ సీఎంను పదవి నుండి తప్పించారు: కేసీఆర్పై రేవంత్ రెడ్డి
ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత, గిరిజన దండోరా సభను నిర్వహించారు. ఈ సభలో సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఆదిలాబాద్:పంచె కట్టుకొన్నాడని దళిత ఉపముఖ్యమంత్రి పదవి నుండి కేసీఆర్ తొలగించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేసిన ఉదంతాన్ని ఆయన ప్రస్తావించారు. ఇంతవరకు ఆయన చేసిన అవినీతిని బయటపెట్టలేదని ఆయన చెప్పారు.
సోమవారం నాడు ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ దళిత గిరిజన దండోరా సభను నిర్వహించింది. ఈ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ కేబినెట్లో మాదిగలకు చోటు లేదన్నారు. తొలి ఐదేళ్లలో కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు స్థానమే లేదని ఆయన చెప్పారు. 40 ఏళ్లుగా దళితులు, గిరిజనుల కోసం కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు నిర్వహించిందని ఆయన చెప్పారు. ఆదిలాబాద్ నుండి అంకితభావం ఉన్న కాంగ్రెస్ నాయకులున్నారన్నారు. కాంగ్రెస్ లో కీలకమైన దళిత నేతలున్నారని చెప్పారు.
దళితులకు రాజ్యాంగం ప్రకారంగా అధికారం రావడానికి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన గుర్తు చేశారు.రిజర్వేషన్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని ఆయన చెప్పారు.దళితుడిని సీఎంగా చేస్తానని చెప్పి ఇంతవరకు దళితులకు న్యాయం చేశాడా అని ఆయన కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణకు దళితుడు సీఎంగా ఉన్నాడా, దరిద్రుడు సీఎంగా ఉన్నాడా అని ఆయన ప్రశ్నించారు.ఇంద్రకరణ్రెడ్డి, జోగు రామన్న, బాల్క సుమన్ లు ఆదిలాబాద్ కు పట్టిన చీడ అని ఆయన విమర్శించారు.