హైదరాబాద్ కు మంచి రోజులొస్తున్నాయి
కాలుష్య పరిశ్రమల తరలింపునకు అధికారులతో కేటీఆర్ సమీక్ష
దేశంలోని అత్యంత కాలుష్య నగరాల్లో హైదరాబాద్ కూడా చోటు దక్కించుకుంది. హైటెక్ సిటీగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ముత్యాలనగరం కీర్తి ప్రతిష్టలను కాలుష్యం మసకబారుస్తోంది. దీనికి ప్రధాన కారణం సిటీ మధ్యలో ఉన్న కాలుష్య పరిశ్రమలే.
దాదాపు 20 ఏళ్లుగా సిటీలో కాలుష్యంస్థాయి విపరీతంగా పెరిగిపోతున్న ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదు.దీంతో కాలుష్య బారిన పడి నగరవాసులు రోగాలకు గురవుతున్నారు. జీడిమెట్లలాంటి పారిశ్రామిక వాడల్లో ప్రజల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
ఈ నేపథ్యంలో కాలుష్య కేంద్రాలుగా మారిన పరిశ్రమలను నగరం ఆవలికి తరలించే ప్రక్రియకు ఐటీ మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ రోజు ఆయన రాష్ట్ర కాలుష్య నియంత్రణ అధికారులతో సమీక్ష నిర్వహించి సిటీలో ఉన్న ప్రమాదకర పరిశ్రమలను నగరశివారు ఔటర్ రింగ్ రోడ్డుకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఇప్పటికే ఔటర్ పరిధిలో17 ప్రదేశాలు గుర్తించినట్లు వెల్లడించారు. కాలుష్య ప్రదేశాలను ఈ స్థానాలకు తరలించే ప్రయత్నం చేయనున్నట్లు అధికారులకు వివరించారు.