ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
దేశంలో ఆక్సిజన్ కొరత నివారణకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
న్యూఢిల్లీ: దేశంలో ఆక్సిజన్ కొరత నివారణకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. శుక్రవారం నాడు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఆక్సిజన్ కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నట్టుగా ఆయన చెప్పారు. విదేశాల నుండి ఆక్సిజన్ ను దిగుమతి చేసుకొంటున్నట్టుగా కిషన్ రెడ్డి వివరించారు. దేశంలో ఆక్సిజన్ రవాణాకు ఉపయోగించే ట్యాంకర్ల కొరత నివారణకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకొంటుందన్నారు. ఆక్సిజన్ ట్యాంకర్లు 1600 అందుబాటులో ఉండేవన్నారు. ప్రస్తుతం 22 వేల మెట్రిక్ టన్నులకు పెంచామన్నారు.
also read:కరోనా వేళ పేదలకు చిప్స్ ప్యాకెట్లు పంచిన మంత్రి కిషన్ రెడ్డి
ఆక్సిజన్ కొరత నివారణకు గాను డీఆర్డీఓ సహకారంతో ఎక్కడికక్కడ ఆక్సిజన్ తయారీ కోసం అన్ని రకాల చర్యలు తీసుకొన్నామని ఆయన వివరించారు. దేశంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ అందించేందుకుగాను తేజాస్ యుద్ద విమానాల్లో ఉపయోగించే టెక్నాలజీ సహాయంతో ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.ఈ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు ఒక్కో నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ను తయారు చేయనుందని మంత్రి చెప్పారు. ఒక్కో ప్లాంట్ ద్వారా 150 మంది రోగులకు ఆక్సిజన్ అందించే సామర్ధ్యం ఉంటుందన్నారు. 195 సిలిండర్లలో ఆక్సిజన్ రీ ఫిల్ చేసుకొనే సామర్ధ్యం ఉంటుందని ఆయన తెలిపారు.
డిఆర్డీఓ రూపొందించిన మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు వాతావరణంలోని గాలిని పీల్చుకొని ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తాయని మంత్రి వివరించారు. ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోవడం ద్వారా ఆక్సిజన్ కొరతను అధిగమించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.తెలంగాణలో 19 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు.