అసెంబ్లీలోనే పీఆర్సీని ప్రకటిస్తాం: కేసీఆర్
శాసనసభ వేదికగా రెండు మూడు రోజుల్లోనే ఉద్యోగులకు గౌరవ ప్రదమైన పీఆర్సీని ప్రకటిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.
హైదరాబాద్: శాసనసభ వేదికగా రెండు మూడు రోజుల్లోనే ఉద్యోగులకు గౌరవ ప్రదమైన పీఆర్సీని ప్రకటిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఆయన బుధవారం నాడు సమాధానం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై తమకు ఎంత ప్రేమ ఉందో పీఆర్సీ ద్వారా వెల్లడిస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత పీఆర్సీని ప్రకటించనున్నట్టుగా తెలిపారు.
కరోనాతో రాష్ట్రంపై లక్షల కోట్లభారం పడిన విషయాన్ని ఆయన అసెంబ్లీలో ప్రకటించారు.ప్రత్యక్షంగా రూ. 52 వేల కోట్ల ఆదాయం, పరోక్షంగా మరో రూ. 50 వేల కోట్లు నష్టపోయినట్టుగా చెప్పారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందే ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఉండేవన్నారు. దేశంలోనే అత్యధిక జీతాలు తీసుకొంటున్న ఉద్యోగులుగా తెలంగాణ ఉద్యోగులేనని ఆయన గర్వంగా చెప్పుకొనే విధంగా వేతనాలు ఇస్తామని చెప్పామన్నారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కపై కేసీఆర్ పలు సమయాల్లో చురకలు అంటించారు. తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ నేతలు అభినందించలేదన్నారు.