Kishan Reddy: హైదరాబాద్ ఎంపీ సీటు గెలవాల్సిందే.. వచ్చే వారం అభ్యర్థుల ప్రకటన: కిషన్ రెడ్డి
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే వారం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తామని వివరించారు. ఈ సారి హైదరాబాద్ ఎంపీ స్థానంలో పోటీలో ఉండటానికి కాదు.. అసదుద్దీన్ ఒవైసీని ఓడించడానికే పోటీ చేయాలని అన్నారు.
![we should contest from hyderabad lok sabha seat to win says telangana bjp president kishan reddy kms we should contest from hyderabad lok sabha seat to win says telangana bjp president kishan reddy kms](https://static-ai.asianetnews.com/images/01hka622ae5737x2fp1jfpwzrn/kishan-reddy-jpg_363x203xt.jpg)
Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 28వ తేదీన కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారని చెప్పారు. అనంతరం, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని వివరించారు. పార్లమెంటు ఎన్నికల కోసం అందరూ సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.
కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. లక్ష మంది ఒవైసీలు వచ్చినా నరేంద్ర మోడీని ప్రధానమంత్రి కాకుండా ఆపలేరని అన్నారు. ఈ సారి హైదరాబాద్ లోక్ సభ స్థానంపై ఫోకస్ ఎక్కువ పెట్టాలని వివరించారు. హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఏదో నామ్ కే వాస్త్ నిలబడినట్టు ఉండకూడదని అన్నారు. గట్టి పోటీ ఇవ్వాల్సిందేనని చెప్పారు. ముస్లింలు అందరు ఒవైసీకి మద్దతు ఇవ్వడం లేదని తెలిపారు. యూపీలో 70 శాతం ముస్లిం జనాభా ఉన్న ఏరియాల్లో కూడా బీజేపీ అభ్యర్థులే గెలిచారని, ఇక్కడ హైదరాబాద్లో కూడా బీజేపీ గెలుపు సాధ్యమేనని అన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎం పార్టీని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్ ఖేల్ ఖతం అవుతుందని పేర్కొన్నారు. ఆ పార్టీ క్రమ క్రమంగా కనుమరుగు అవుతుందని తెలిపారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పార్లమెంటు ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు.