ఏడు మండలాలు లాగేసుకొన్నారు, నష్టపోయాం: కేకే
రాష్ట్ర విభజన సమయంలో ఏపీతో పాటు తెలంగాణకు ఇచ్చిన హమీలను అమలు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు డిమాండ్ చేశారు.హైకోర్టు విభజన గురించి న్యాయ శాఖ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన సమయంలో ఏపీతో పాటు తెలంగాణకు ఇచ్చిన హమీలను అమలు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు డిమాండ్ చేశారు.హైకోర్టు విభజన గురించి న్యాయ శాఖ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
మంగళవారం నాడు ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ఏపీ విభజన హమీ చట్టంపై రాజ్యసభలో జరిగిన చర్చలో టీఆర్ఎస్ ఎంపీ కే. కేశవరావు ప్రసంగించారు. అమలు చేయలేనప్పుడు చట్టాలు ఎందుకని కేశవరావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా హైకోర్టు కూడ ఏర్పాటు చేసుకోలేని దుస్థితి నెలకొందన్నారు.
ఏపీ కోసం ఏడు మండలాలను లాగేసుకొన్నారని కేశవరావు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదన్నారు. కానీ, ఈ ప్రాజెక్టు కోసం తమ రాష్ట్రానికి చెందిన 7 మండలాలను తీసుకొన్నారని ఆయన విమర్శించారు.
రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ కూడ నష్టపోయిందన్నారు. ఏపీ రాష్ట్రానికి సానుభూతి తెలుపుతున్నారన్నారు. తెలంగాణ కూడ నష్టపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కూడ సానుభూతి తెలపాలన్నారు. తెలంగాణకు 4 వేల మెగావాట్ల విద్యుత్ ను ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం 1600 మెగావాట్ల విద్యుత్ ను మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. తమ రాష్ట్రం అవసరాల కోసం ఛత్తీస్ఘడ్ రాష్ట్రం నుండి విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
విభజన హమీ చట్టంపై కోర్టులో కేసు నడుస్తోందని చెప్పారు. ఏపీలోని కడపతో పాటు ఖమ్మంలోని బయ్యారంలో కూడ స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేయాలని కేశవరావు డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజన విషయంలో అశాస్త్రీయంగా జరిగిందని చెప్పడం సరైంది కాదన్నారు. తెలంగాణకు కూడ కేంద్రం నుండి రావాల్సిన నిధులను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి కేంద్రం నుండి దక్కాల్సిన నిధులను కూడ ఇవ్వాలని ఆయన కోరారు. సీఎం రమేష్, సుజనాచౌదరి డిమాండ్లకు తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.