వరంగల్ నగరంలోని చార్బౌలిలో విషాదం చోటు చేసుకుంది. చార్బౌలిలో శిథిలావస్థకు చేరిన ఓ పాతభవనం కూల్చి వేస్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు.
వరంగల్ నగరంలోని చార్బౌలిలో విషాదం చోటు చేసుకుంది. ఓ పాత భవనాన్ని కూల్చివేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. వివరాలు.. చార్బౌలిలో శిథిలావస్థకు చేరిన ఓ పాతభవనం కూల్చి వేస్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. గాయపడినవారిని వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.
శిథిలాల కిందపడి మరణించిన వారి మృతదేహాలను వెలికితీశారు. వారిని సాగర్, సునీతలుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున అయిల్ ట్యాంకర్ బ్రిడ్జిపై నుంచి పడిపోయిన ఘటనలు.. నలుగురు సజీవ దహనమయ్యారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మృతులను పంకజ్ నయాజ్, దీపు ఖతువా, సమీర్ నాయక్, చందన్ ఖతువాగా గుర్తించారు. వీరు సహాయక చర్యలు చేపట్టేందుకు వెళ్లి మృతి చెందారు.
నివేదికల ప్రకారం.. పారాదీప్ నుంచి అయిల్ ట్యాంకర్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్యాంకర్ తెల్లవారుజామున 1.45 గంటల సమయంలో ఇటమటి వద్ద బడా పాండుసార వంతెనపైకి చేరుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్యాంకర్ వంతెన రెయిలింగ్ను ఢీకొట్టింది. అనంతరం ట్యాంకర్ వంతెనపై నుంచి కిందపడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కొందరు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే సహాయక చర్యలు చేపడుతున్న సమయంలోనే.. పూర్తిగా ఆయిల్తో నిండి ఉన్న ట్యాంకర్ పేలిపోయింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న నలుగురు స్థానికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు.
ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.పేలుడు ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తొలుత నయాగఢ్లోని ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్కు తరలించారు.
