ఆర్మీ, రైల్వే ఆసుపత్రులను కోవిడ్ ఆసుపత్రులుగా మారుస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
దేశంలోని ఆర్మీ, రైల్వే, ఎయిమ్స్ సహా అన్ని ఆస్పత్రులను కొవిడ్ ఆస్పత్రులుగా మార్చుతున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్:దేశంలోని ఆర్మీ, రైల్వే, ఎయిమ్స్ సహా అన్ని ఆస్పత్రులను కొవిడ్ ఆస్పత్రులుగా మార్చుతున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.బుధవారం నాడు మంత్రి బొల్లారంలోని కంటోన్మెంట్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మారుస్తున్నట్టుగా మంత్రి చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు మంజూరు చేస్తామన్నారు.
త్రివిధ దళాలు, పారామిలిటరీ రిటైర్డ్ వైద్య సిబ్బంది సేవలు వినియోగించుకుంటామని కిషన్రెడ్డి చెప్పారు. యువతకు 15 రోజుల పాటు శిక్షణను ఇచ్చి వారి సేవలు ఉపయోగించుకుంటామన్నారు. మెడికోల సేవలను ఉపయోగించుకొని భవిష్యత్తులో ఉద్యోగాల్లో వెయిటేజ్ ఇస్తామన్నారు. వీలైతే సేవ చేయాలి, సలహాలివ్వాలి కానీ ప్రభుత్వాన్ని విమర్శించి అడ్డంకులు సృష్టించొద్దని కిషన్రెడ్డి విపక్షాలను కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు గాను రాఫ్ట్ర ప్రభుత్వం ఇవాళ్టి నుండి లాక్డౌన్ ను అమలు చేస్తోంది. 10 రోజుల పాటు రోజూ 20 గంటలపాటు లాక్ డౌన్ అమలు చేయనున్నారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం లాక్డౌన్ నుండి మినహాయింపు ఇచ్చింంది ప్రభుత్వం.