దళిత ముఖ్యమంత్రి.. 2014 మాటకు ఇప్పుడైనా కట్టుబడతారా : కేసీఆర్పై కిషన్ రెడ్డి ప్రశ్నల వర్షం
2014లో ఇచ్చిన మాటకు ఈసారైనా కేసీఆర్ కట్టుబడి వుండాలన్నారు కేంద్ర మంత్రి , తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. కాంగ్రెస్ దళితులు, బీసీలను ఏనాడూ పట్టించుకోలేదని.. దళితుడిని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
![union minister kishan reddy slams telangana cm kcr ksp union minister kishan reddy slams telangana cm kcr ksp](https://static-ai.asianetnews.com/images/01h8vcfpsedvp6rbz51bexzyh1/kishan-reddy--2--jpg_363x203xt.jpg)
బీసీలను అవమానించేలా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి , తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014లో ఇచ్చిన మాటకు ఈసారైనా కేసీఆర్ కట్టుబడి వుండాలన్నారు. కాంగ్రెస్ దళితులు, బీసీలను ఏనాడూ పట్టించుకోలేదని.. దళితుడిని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 3 తర్వాత బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తామని.. 50 ఏళ్లకు పైగా కాంగ్రెస్ రాష్ట్రాన్ని పాలించిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
వందలాది మంది విద్యార్ధులను కాంగ్రెస్ చంపిందని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అవినీతికి కాంగ్రెస్ పర్యాయ పదమని.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలలకో ముఖ్యమంత్రి మారుతారని ఆయన చురకలంటించారు. కాంగ్రెస్ హయాంలో బొగ్గు నుంచి హెలికాఫ్టర్ల వరకు అన్నింట్లో అవినీతేనని కిషన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్ధిక సంక్షోభం ఏర్పడుతుందని దుయ్యబట్టారు.
ALso Read: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : ఖరారైన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన .. షెడ్యూల్ ఇదే
ఇకపోతే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు ప్రచారం చేశారు. తాజాగా ప్రధాని మోడీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 25న మహేశ్వరం, కామారెడ్డి సభల్లో ప్రధాని పాల్గొననున్నారు. ఆ మరుసటి రోజు నవంబర్ 26న తూప్రాన్, నిర్మల్.. 27న మహబూబాబాద్, కరీంనగర్ సభల్లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్లో ప్రధాని రోడ్ షోలో పాల్గొననున్నారు.