బీజేపీ అగ్రనేతలు  ఇవాళ బండి సంజయ్ కు ఫోన్  చేశారు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ జైలు నుండి విడుదలైన  విషయం తెలిసిందే. 

కరీంనగర్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం నాడు ఫోన్ చేశారు. జైలు నుండి విడుదలైన తర్వాత బండి సంజయ్ కు అమిత్ షా ఫోన్ చేశారు.

టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ కేసులో బెయిల్ మంజూరు కావడంతో ఇవాళ ఉదయం కరీంనగర్ జైలు నుండి బండి సంజయ్ విడుదలయ్యారు. బండి సంజయ్ జైలు నుండి విడుదలైన విషయం తెలుసుకున్న పార్టీ అగ్రనేతలు ఆయనకు ఫోన్ చేశారు. అమిత్ షా తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బండి సంజయ్ కు ఫోన్ చేశారు. బీఆర్ఎస్ కుట్రలను తిప్పి కొడుదామని బండి సంజయ్ కు బీజేపీ అగ్రనేతలు చెప్పారు. ప్రజాసమస్యలపై పోరాడాలని బీజేపీ నేతలు సూచించారు. 

టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ కుట్ర కేసులో ఈ నెల 4వ తేదీన బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కసు అంశాన్ని పక్కదారి పట్టించేందుకు టెన్త్ క్లాస్ పేపర్ లీక్ ను తెరమీదికి తెచ్చారని బీజేపీ ఆరోపించింది. తప్పుడు కేసులకు భయపడబోమని బీజేపీ నేతలు చెప్పారు.

also read:కరీంనగర్ జైలు నుండి బండి సంజయ్ విడుదల

టెన్త్ క్లాస్ హిందీ పేపర్ కుట్ర కేసు అంశం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతుంది. రాష్ట్ర ప్రభుత్వంపై బుదరచల్లేందుకు బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. బీజేపీ కుట్రలను పోలీసులు దర్యాప్తులో బయటపెట్టారని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ తరుణంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది