Asianet News TeluguAsianet News Telugu

అత్తారింటికి వెళ్లి... ప్రమాదవశాత్తు ఇద్దరు తోడల్లుళ్ల దుర్మరణం

కల్లు తాగి అదే మత్తులో బావమరిదితో కలిసి ఈతకు వెళ్లిన ఇద్దరు తోడల్లుళ్లు నీటమునిగి చనిపోయారు.  
 

Two persons die after falling into well in vikarabad  akp
Author
Vikarabad, First Published Apr 12, 2021, 10:28 AM IST

తాండూరు: అత్తారింటికి వచ్చిన ఇద్దరు అల్లుళ్లు ప్రమాదవశాత్తు మృతిచెందిన విషాద సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కల్లు తాగి అదే మత్తులో బావమరిదితో కలిసి ఈతకు వెళ్లిన ఇద్దరు తోడల్లుళ్లు నీటమునిగి చనిపోయారు.  

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం కొత్లాపూర్‌ గ్రామానికి చెందిన వడ్డె వెంకటప్ప, శ్యామప్ప అన్నదమ్ములు. వెంకటప్ప కూతురు మాధవికి సిరిగిపేటకు చెందిన కృష్ణ(31)తో, శ్యామప్ప కూతురు రేణుకకు గిరిజాపూర్ కు చెందిన మహిపాల్(25)తో వివాహం జరిగింది. ఓ పాలిషింగ్‌ యూనిట్లో పనిచేసే కృష్ణ, మహిపాల్ ఇటీవల ఉపాధి కోల్పోయారు. దీంతో కొద్దిరోజులగా వారు పని లేక ఖాళీగా వున్నారు. 

ఈ క్రమంలో మల్కాపురం గ్రామంలోని ఓ పాలిషింగ్‌ యూనిట్‌ లో పని మాట్లాడుకునేందుకు వెళ్లిన కృష్ణ, మహిపాల్ అక్కడినుండి నేరుగా అత్తవారింటికి వెళ్లారు. అక్కడ కల్లు తాగిన ఇద్దరు బావమరిది నర్సింహులుతో కలిసి గ్రామ సమీపంలో ఓ వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లారు. మహిపాల్ కు ఈత రాకపోయినా ఓ డబ్బాను నడుముకు కట్టుకుని బావిలోకి దిగాడు. ఈ క్రమంలో అతడు నీటమునిగిపోతుండగా కృష్ణ కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే ఇద్దరూ మత్తులో వుండటంతో నీటమునిగి ఊపిరాడక మృత్యువాతపడ్డారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మోటార్లతో నీటిని తోడి మహిపాల్, కృష్ణ  మృతదేహాలను బయటకు తీశారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇలా ఒకేసారి ఇద్దరు అల్లుళ్లు చనిపోయి కూతుర్లు ఒంటరివారు అవడంతో ఆ కుటుంబం కన్నీటిపర్యంతం అయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios