జల్సాలకోసం చెయిన్ స్నాచర్ గా మారిన ఎల్ఎల్బీ విద్యార్థి
మియాపూర్ లో దొంగతనం చేస్తూ పట్టుబడిన ఇద్దరు దొంగలు
ఆ యువకుడు ఎల్ఎల్బీ చదువుతున్నాడు. చదువు పూర్తి చేసి చట్టాన్ని కాపాడాల్సింది పోయి జల్సాలకు అలవాటు పడి చట్టవ్యతిరేకమైన పనులు చేస్తూ పోలీసులకు చిక్కాడు. దీంతో చదువు మద్యలో ఉండగానే కటకటాలపాలు కావాల్సి వచ్చింది.
అసలు విషయం ఏంటంటే మియాపూర్ పోలీసులు ఇవాళ ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేశారు. అయితే అందులో ఓ స్నాచర్ ను ఎల్ఎల్బీ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. బుద్దిగా చదువుకుని ఎల్ఎల్బీ పూర్తిచేసి న్యాయాన్ని కాపాడాల్సిన ఇతడు చెడు స్నేహాలకు అలవాటుపడి తప్పుడు మార్గంలో నడిచి చైన్ స్నాచర్ గా మారాడు.
ఈ గొలుసు దొంగలు మియాపూర్ ప్రాంతంలో ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేసేవారని పోలీసులు చెబుతున్నారు. బైక్ పై వచ్చి మహిళల మెడలో గొలుసులు తస్కరించేవారు. వీరిసి అరెస్ట్ చేసిన పోలీసులు ఓ బైక్ తో పాటు రెండు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
యూట్యూబ్ లో వీడియోలు చూసి నిందితులు గొలుసు చోరీలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.