తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా గండీడ్‌కు చెందిన తిరుపతయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేసినవారి సంఖ్య 15 కు చేరింది.అయితే ఈ కేసును లోతుగా విచారిస్తున్న కొద్ది కీలక విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. గండీడ్ మండలం సల్కర్‌పేటకు చెందిన తిరుపతయ్య ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఢాక్యా నాయక్ దగ్గర నుంచి ఏఈ పేపర్ తీసుకొన్న తిరుపతయ్య.. రాజేంద్రకుమార్‌కు అమ్మినట్లు విచారణలో సిట్ అధికారులు గుర్తించినట్టుగా సమాచారం. 

ఇక, గండీడ్ మండలానికే చెందిన రేణుకా, ఆమె భర్త ఢాక్యా నాయక్‌లను ఈ కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుపతయ్య అరెస్ట్‌తో ఈ మండలంలో ఈ కేసుతో మరికొందరికి కూడా సంబంధం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఇక, ఈ కేసులో తొలుత 9 మందిని అరెస్ట్ చేయగా.. ఆ తర్వాత మరికొందరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టయిన నిందితుల సంఖ్య 14కి చేరింది. అరెస్ట్ అయిన వారిలో ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, డాక్యా నాయక్, రాజేశ్వర్, రేణుకా, నీలేష్, గోపాల్, శ్రీనివాస్, రాజేందర్ నాయక్, షమీమ్, సురేష్, రమేష్ నాయక్, ప్రశాంత్ రెడ్డి, రాజేందర్ కుమార్‌లు ఉన్నారు. ఈ కేసులో తొలుత అరెస్ట్ చేసిన 9 మంది నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. 

అయితే తాజాగా వారిలో నలుగురు నిందితులు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, డాక్యా నాయక్, రాజేశ్వర్‌లను మూడు రోజులు కస్టడీలోకి తీసుకునేందుకు ఈ నెల 25న కోర్టు అనుమతించింది. ఈ క్రమంలోనే సిట్ అధికారులు ఆదివారం(మార్చి 26) రోజున నలుగురు నిందితులను రెండోసారి కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి వారిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. హిమాయత్ నగర్‌లోని సిట్ కార్యాలయానికి తరలించారు. దాదాపు 8 గంటల పాటు నలుగురు నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించారు. 

అయితే నేడు రెండో రోజు కూడా నలుగురు నిందితులను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఉదయం సీసీఎస్‌ నుంచి నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు.. సిట్ కార్యాలయానికి తరలించారు. ఈ కేసులో రాజశేఖర్ రెడ్డి కీలకంగా ఉన్నట్టుగా సిట్ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. కస్టడీలోకి తీసుకున్న నలుగురు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. మరో ముగ్గురిని కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరి కస్టడీ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మరికొందరి అరెస్ట్‌లు జరిగే అవకాశం కనిపిస్తుంది.