పేపర్ లీక్ కేసు : ఆ 37 మంది డీబార్.. టీఎస్పీఎస్సీ సంచలన నిర్ణయం
పేపర్ లీక్ కేసుకు సంబంధించి టీఎస్పీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. వారు భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలు రాయకుండా డీబార్ చేయాలని డిసైడ్ అయ్యింది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పేపర్ లీక్ కేసుకు సంబంధించి టీఎస్పీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. అరెస్ట్ అయిన 37 మందిని డీబార్ చేయాలని నిర్ణయించింది. వారు భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలు రాయకుండా డీబార్ చేయాలని డిసైడ్ అయ్యింది. అభ్యంతరాలుంటే 2 రోజుల్లో రిప్లయ్ ఇవ్వాలని సదరు 37 మందికి నోటీసుల్లో తెలిపింది.
కాగా.. పేపర్ లీక్ కేసులో వెలుగులోకి కొత్త కోణం వచ్చింది. ఇప్పటి వరకు ఈ కేసులో 43 మంది నిందితులను సిట్ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ డీఈ పేరు ఈ కేసులో తెరపైకి వచ్చింది. విద్యుత్ శాఖ డీఈ కనుసన్నల్లో ఏఈ పేపర్ పెద్ద ఎత్తున చేతులు మారినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. దాదాపు 20 మందికి ప్రశ్నాపత్రాలు విక్రయించినట్లుగా సిట్ గుర్తించింది. ఇతను వరంగల్లో ఓ కోచింగ్ సెంటర్ శిక్షకుడిగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. అభ్యర్ధులతో పరిచయం పెంచుకుని దందాకు తెరలేపినట్లుగా సిట్ గుర్తించింది. పరీక్ష రాసి టాప్ మార్కులు సాధించిన వారిపై సిట్ ఫోకస్ పెట్టింది . ఇప్పటికే విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ రవి కిశోర్ను సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: టీఎస్పీఎస్సీ ఏఈఈ పరీక్షలో ఎలక్ట్రానిక్ డివైజ్ల వినియోగం: ముగ్గురు అరెస్ట్
కాగా.. టీఎస్పీఎస్సీలో ఈ ఏడాది మార్చి 12, 15, 16 తేదీల్లో జరగాల్సిన రెండు పరీక్షలను రద్దు చేశారు. మార్చి 12న టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్, మార్చి 15, 16 తేదీల్లో అసిస్టెంట్ సివిల్ సర్జన్ నియామాకాల పరీక్షలను తొలుత టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీ కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని తొలుత భావించారు. కానీ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిందని ఆ తర్వాత గుర్తించారు పోలీసులు. ఈ ఏడాది మార్చి 5న జరిగిన ఏఈఈ పరీక్ష పేపర్ లీక్ అయిందని అధికారులు గుర్తించారు . ఈ కేసు విచారణను సిట్కు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం . ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో సిట్ బృందం విచారణ నిర్వహిస్తుంది.