TSPSC : రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. ఆ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..
TSPSC Notification: తాజాగా కాంగ్రెస్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. TSPSC ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో టీఎస్పీఎస్సీ బోర్టులో కొత్త ఛైర్మన్తో సహా సభ్యులు రానున్నారు.
![TSPSC invites applications for chairman, panel members KRJ TSPSC invites applications for chairman, panel members KRJ](https://static-ai.asianetnews.com/images/01dxwk1see3qdptrbrg0b9sm9j/tspsc-notification-jpg_363x203xt.jpg)
TSPSC Notification: ఇటీవల టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్రెడ్డితో పాటు మరో ముగ్గురు సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వారి రాజీనామాలను గవర్నర్ తమిళిసై కూడా ఆమోదించారు. అయితే.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యుల పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనీ, నమూనా దరఖాస్తు ఫారమ్లు , విద్యార్హతలు ఇతర వివరాలను అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ www.telangana.gov.in లో తెలిపింది. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు నమూనా దరఖాస్తు ప్రకారం నిర్ణీత ఫార్మాట్లో తమ దరఖాస్తులను సమర్పించాలని పేర్కొంది. దరఖాస్తులను ఆన్లైన్లో లేదా ఇమెయిల్ ద్వారా secy-ser-gad@telangana.gov.inకు జనవరి 18, 2024న సాయంత్రం 5 గంటలలోపు సమర్పించవచ్చు.
ఈ నిర్ణయంతో టీఎస్పీఎస్సీ బోర్టులో కొత్త ఛైర్మన్తో సహా సభ్యులు రానున్నారు.ఇటీవల గ్రూప్ ఉద్యోగాలకు సంబంధించి ప్రశ్నపత్రాలు లీక్ కావడం, పరీక్షలు వాయిదా పడటం, నోటిఫికేషన్స్ రద్దు కావడం లాంటి నిర్లక్యాలు వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో చైర్మెన్ జనార్ధన్ రెడ్డి తొలగించి టీఎస్పీఎస్సీ బోర్డును (TSPSC Board) ప్రక్షాళన చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు వెలువడ్డాయి. నిరుద్యోగులు భారీ ఎత్తున డిమాండ్ చేశారు.
దీంతో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు తాము అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేస్తామని హామీలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలనుకున్నారు. ఆ తర్వాత సభ్యులు కూడా రాజీనామాలు చేశారు. తాజాగా వారి రాజీనామాలను గవర్నర్ తమిళిసై కూడా ఆమోదించారు. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ సర్కార్ TSPSC ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయడంతో మరికొన్ని రోజుల్లో కొత్త కమిషన్ ఏర్పాటు కానుంది.