గ్రూప్-1 పరీక్షకు అప్లై చేయకపోయినా హాల్టికెట్ జారీ చేశారా?.. క్లారిటీ ఇచ్చిన టీఎస్పీఎస్సీ
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేసుకోకపోయినా ఓ అభ్యర్థికి హాల్ టికెట్ జారీ చేశారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై టీఎస్పీఎస్సీ స్పందించింది.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేసుకోకపోయినా ఓ అభ్యర్థికి హాల్ టికెట్ జారీ చేశారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై టీఎస్పీఎస్సీ స్పందించింది. గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేయకుండానే.. ప్రిలిమినరీ పరీక్షకు హాల్ టికెట్ జారీ చేశామని చెప్పడంలో నిజం లేదని తెలిపింది. ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నట్టుగా పేర్కొంది. జామాబాద్ కు చెందిన అభ్యర్థి జక్కుల సుచిత్ర గతేడాది గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేశారని.. గతంలో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు సైతం ఆమె హాజరయ్యారని టీఎస్ పీఎస్సీ స్పష్టం చేసింది.
గతేడాది అక్టోబర్ 16వ తేదీన నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీకి సుచిత్ర హాజరయ్యారని.. ఆమెకు నిజామాబాద్లోని ఆర్పీ రోడ్డులోని ఏహెచ్ఎంవీ జూనియర్ కాలేజీలో సెంటర్ పడిందని తెలిపింది. ఆమె పరీక్షకు హాజరై నామినల్ రోల్లో కూడా సంతకం చేశారని టీఎస్పీఎస్సీ పేర్కొంది. ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని కోరింది.
నిజమాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన జక్కుల సుచిత్ర అనే యువతి గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షలకు మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్టుగా చెబుతోంది. అయితే ఆమెకు గ్రూప్-1 హాల్ టికెట్ కూడా జారీ అయింద చెప్పుంది. అయితే తాను గ్రూప్-1కు అప్లై చేయకుండానే తనకు హాల్ టికెట్ రావడంతో ఆందోళన చెందినట్టుగా సుచిత్ర చెప్పింది. అయితే ఈ వాదనలో నిజం లేదని తాజాగా టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది.
ఇక, టీఎస్పీఎస్సీ 994 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61.16 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్-1 పోస్టుల భర్తీకి మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో 501 గ్రూప్-1 పోస్టుల భర్తీకి జూన్ 11న మొత్తం 994 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. గతేడాది అక్టోబర్ 16న జరిగిన పరీక్షకు 6 లక్షల మంది (79.15 శాతం) అభ్యర్థులు హాజరు కాగా, తాజాగా జరిగిన ప్రిలిమ్స్ కు దాదాపు 50 వేలకు పైగా అభ్యర్థులు దూరంగా ఉన్నారు.