కొత్త రాష్ట్రం ఇక్కడ... కొలువుల జాతర అక్కడ
రాష్ట్రం వచ్చి రెండున్నరేళ్లు గడిచాయి.. కొడుకు, కూతురు, అల్లుడికి అనుకున్న ఉద్యోగాలే వచ్చాయి. లాఠీ దెబ్బలు, తూటాల చప్పుళ్లకు బలైన విద్యార్థులకు మాత్రం ఉద్యోగం ఉత్తి మాటగానే మిగిలింది.లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న మాట ఇప్పుడు నీటి మీద రాతగానే మారింది.
నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయం నుంచి రగిలిన ఉద్యమమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. 60 ఏళ్లుగా సాగిన ఈ పోరాటంలో అడుగడుగునా నినదించింది కూడా ఆ మూడింటి కోసమే.
ఎట్టకేలకు ఉద్యమం ఫలించింది. తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. మరి నీళ్లు, నిధులు, నియామకాల మాటేమిటి.
రెండున్నరేళ్ల పాలన తర్వాత ఒకసారి పరిశీలిస్తే బంగారు తెలంగాణ కాదు కదా కనీసం బతికే భారంగా తయారైంది.
ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకే వస్తాయని యువత ఆశించింది. తమ ఆశయ సిద్ధికోసం ఉద్యమానికి ఆత్మార్పణ కూడా చేసుకుంది. ఉద్యమ పార్టీకే అధికార పీఠాన్ని అప్పగించింది.
రెండున్నరేళ్లు గడిచాయి.. కొడుకు, కూతురు, అల్లుడికి అనుకున్న ఉద్యోగాలే వచ్చాయి. లాఠీ దెబ్బలు, తూటాల చప్పుళ్లకు బలైన విద్యార్థులకు మాత్రం ఉద్యోగం ఉత్తి మాటగానే మిగిలింది.లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న మాట ఇప్పుడు నీటి మీద రాతగానే మారింది.
హైదరాబాద్ ను పోగొట్టుకొని అప్పుల ఊబిలో కూరుకపోయిన పక్క రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలవుతుంటే..
ధనికరాష్ట్రంలో... మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో..ఉద్యోగాల ఊసే కనిపించడంలేదన్న నిసృహ ఇక్కడ యువతలో నెలకొంటోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలన్నీ ఆంధ్రోళ్లే కొల్లగొట్టారు. వారు వెళ్లిపోతే ఉద్యోగాలన్నీ మనవేనన్నారు. వారు వెళ్లిపోయారు. మరి ఉద్యోగాలేవీ అని స్వరం పెంచుతోంది ఇక్కడి యువత.
అక్కడేమో కలెక్టర్ పోస్టులనుంచి కండక్టర్ పోస్టుల వరకు సర్కారీ ఉద్యోగాలన్నీ నింపేస్తున్నారు.
ఇక్కడేమో ఉద్యోగమే ఉద్యమంగా పోరాడిన యువతకు ఊరించే ఆశలు తప్ప నోటిఫికేషన్లే లేవు.
ఇటీవల ఏపీ లో గ్రూప్ 1 నుంచి గ్రూప్ 3 వరకు మొత్తంగా 5 వేల పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేశారు. గతంలో కానిస్టేబుల్, ఎస్సై, టీచర్ పోస్టుల భర్తీని కూడా చెపట్టారు.
అదే తెలంగాణ లో ప్రభుత్వానికి అత్యంత అవసరమైన ఏఈ పోస్టుల భర్తీ తప్ప మరో ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు.
నోటిఫికేషన్లకు ఇస్తామన్న పేరు తప్ప ఒక్క ప్రకటన కూడా జారీ కాలేదు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటికే 60 వేల పోస్టులను భర్తీ చేశామని చెబుతుండటం గమనార్హం.
ఉద్యోగాల భర్తీపై ఇదే సాగదీత ధోరణి అవలంభిస్తే విద్యార్థులనుంచి మరో ఉద్యమం మొదలవడం మాత్రం స్పష్టం.
మిగులు రాష్ట్రం.. ధనిక రాష్ట్రం అని చెప్పుకొని పాలకులు ఉద్యోగాల భర్తీపై మౌనంగా ఉంటే ఇంటి పార్టీని బయటకి గెంటే ప్రమాదం ఉంది.