Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ నిరుద్యోగులకు కటికె ఛేదువార్త

  • ఉద్యోగ నియామకాలపై కొత్తగా అగ్గి రాజేసిన సిఎం
  • ఉద్యోగ నియామకాల జోనల్ వ్యవస్థ (371డి)ను సవరించాలి
  • రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతం
  • కొత్త జిల్లాలకు అనుగుణంగా జిల్ల, జోన్, మల్టీ జోన్, స్టేట్ పోస్టుల నిర్ధారణ
  • జోనల్ వ్యవస్థ అధ్యయనానికి మంత్రులు, అధికారులతో కమిటీ
  • జిల్లా కేడర్ పోస్టులకు కొత్త జిల్లాలే ప్రాతిపదిక
TS job aspirants may have to wait longers than expected for the notifications

ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు ఇప్పట్లో ఉద్యోగాలు లేవని ప్రభుత్వం మరోసారి అధికారికంగా వెల్లడించింది. డిఎస్సీకి తొందరేముంది? డిఎస్సీ అర్జంట్ గ వేయకపోతే ప్రపంచం మునిగిపోతదా అని సిఎం కేసిఆర్ కామెంట్లు చేసిన 24 గంటలు గడవకముందే మరో అధికారిక ప్రకటన వెలువడింది. నియామక ప్రక్రియనంతా కొత్త పుంతలు తొక్కించాలన్న నిర్ణయానికి వచ్చింది కేసిఆర్ సర్కారు. మరి కొత్త రాష్ట్రంలో కొత్త కొలువులు అనేది ఇక ఎన్నికల వేళ తప్ప ఇప్పట్లో ఉండవన్న సంకేతాలు ఇచ్చినట్లైంది సర్కారు. సిఎం కేసిఆర్ ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ఆ సమీక్ష వివరాలిలా ఉన్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులను(371 డి) సవరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం కోసం తిరిగి కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగు ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతామని సిఎం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని, దీనికి అనుగుణంగా కొత్త జోన్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని సిఎం అన్నారు. జిల్లా, జోన్, మల్టీ జోన్, స్టేట్ పోస్టులను నిర్ధారించాల్సి ఉందని, కొత్త జోన్ ల ఏర్పాటు కూడ అనివార్యమని సిఎం అన్నారు. ఏ పోస్టు ఏ కేడర్ కు చెందుతుంది? జోన్లు ఎన్ని ఉండాలి? ఏ జోన్ పరిధిలో ఏ జిల్లాలుండాలి? నాలుగు కేడర్ల పోస్టులు ఎలా విభజించాలి? తదితర విషయాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి మంత్రులు, అధికారులతో కూడిన కమిటీని సిఎం నియమించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, జోనల్ వ్యవస్థ, రాష్ట్రపతి ఉత్తర్వులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస రెడ్డి, నాయిని నర్సింహరెడ్డి, హరీష్ రావు, కెటి రామారావు, ఈటెల రాజెందర్, జగదీష్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు,  జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డి, ఎంపిలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, సీనియర్ అధికారులు ఎస్.కె.జోషి, బిఆర్ మీనా, రాజీవ్ రంజన్ ఆచార్య, ఎస్. నర్సింగ్ రావు, వాణీ ప్రసాద్, అజయ్ మిశ్రా, నిరంజన్ రావు, సింగరేణి సిఎండి శ్రీధర్, డిజిపి అనురాగ్ శర్మ, హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కొత్త ఉద్యోగాల నియామకం ఏ ప్రాతిపదికన జరగాలి? జోనల్ వ్యవస్థ ఉండాలా? రద్దు చేయాలా? జోన్లు ఉంటే ఎన్ని ఉండాలి? ఎన్ని కేడర్లు ఉండాలి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జారీచేసిన రాష్ట్రపతి ఉత్తర్వులు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఎట్ల అన్వయించుకోవాలి? పదోన్నతుల విషయంలో ఏర్పడుతున్న వివాదాలను ఎలా పరిష్కరించుకోవాలి? డిఎస్సీ కొత్త జిల్లాల ప్రాతిపదికన  వేయాలా? పాత జిల్లాల ప్రాతిపదికనా? తదితర అంశాలపై కూలంకశంగా చర్చ జరిగింది. జోన్ల వ్యవస్థనకు స్వస్తి పలికి కేవలం జిల్లా, స్టేట్ క్యాడర్ మాత్రమే ఉంచి నియామకాలు చేపట్టాలా? జోన్ల వ్యవస్థను కొనసాగించాలా? అనే అంశంపై ఉన్నతాధికారులంతా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేవలం జిల్లా, స్టేట్ క్యాడర్ మాత్రమే ఉండడం వల్ల ప్రయోజనాలకన్నా ఇబ్బందులే ఎక్కువ ఉంటాయని మంత్రులు, అధికారులు ముక్తకంఠంతో అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉద్యోగార్థులకు, పరిపాలనకు అనువుగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్, స్టేట్ క్యాడర్ పోస్టులు ఉండాలని అభిప్రాయపడ్డారు. అడ్వకేట్ జనరల్, లా సెక్రటరీ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ముఖ్యమంత్రి కూడా ఈ నాలుగు కేడర్ల పోస్టులు కొనసాగించాలని నిర్ణయించారు. కొత్త జోన్ల ఏర్పాటు అనివార్యమైన నేపథ్యంలో పాత రాష్ట్రపతి ఉత్తర్వుల స్థానంలో కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని అడ్వకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డి సూచించారు. దీన్ని ముఖ్యమంత్రి సహా, మంత్రులు అమోదించారు.

‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానికులకు అన్యాయం జరగవద్దనే ఉద్దేశ్యంతో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఏ జోన్ పరిధిలో ఏ జిల్లాలు వస్తాయో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటి దాకా ఇదే పద్ధతిన ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితులు మారాయి. కొత్తగా 21 జిల్లాలు వచ్చాయి. దీంతో రాష్ట్ర స్వరూపం మారింది. పాత జోనల్ విధానం అమలు చేయడం ఇప్పుడు సాధ్యం కాదు. కాబట్టి కొత్త జోన్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో కేవలం రెండు జోన్లు మాత్రమే ఉన్నాయి. వాటి సంఖ్యను పెంచుకోవాలి. ఏ జోన్ లో ఏ జిల్లాలు (కొత్తవి) వస్తాయో నిర్ధారించాలి. అందుకోసం మంత్రులు, అధికారులతో కూడిన కమిటీని నియమిస్తున్నాం. వారు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. కమిటి సిఫారసుల ఆధారంగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై తీర్మానం చేస్తుంది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం కోసం కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వాలని ప్రతిపాదిస్తాం. నేనే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖతో మాట్లాడి వీలైనంత తొందరలో కొత్త ఉత్తర్వులు వచ్చేలా ప్రయత్నిస్తా’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.

‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు,పోస్టింగుల్లో తెలంగాణ వారికి తీరని అన్యాయం జరిగింది. రాష్ట్రపతి ఉత్తర్వులున్నా వాటిని అమలు చేయకుండా దొడ్డి దారులు వెతికారు. రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి రాకుండా కొత్త వ్యవస్థలు సృష్టించారు. వారికి అనుకూలంగా నియామకాలు, పదోన్నతులు, పోస్టింగులు ఇచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అలా జరగడానికి వీలు లేదు. ప్రభుత్వం ద్వారా జరిగే ప్రతీ నియామకం ఖచ్చితంగా రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే ఉండాలి. విద్యుత్, సింగరేణి, ఆర్టీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు కూడా వాటి పరిధిలోకి రావాలి. ఏ కేడర్ కింద ఏ పోస్టు ఉందో కూడా ముందే స్పష్టంగా తెలియాలి. పదోన్నతుల విషయంలో స్పష్టత రావాలి. దీని కోసం సమగ్ర అధ్యయనం జరగాలి.  ఏ పోస్టు ఏ కేడర్ కిందికి వస్తుంది? జోనల్ వ్యవస్థ ఎలా ఉండాలి? మల్టీ జోనల్, స్టేట్ లెవల్ పోస్టులను ఎలా నిర్థారించాలి? తదితర అంశాలను కమిటీ సమగ్రంగా పరిశీలించాలి. అన్ని శాఖల కార్యదర్శులతో, కలెక్టర్లతో సమావేశమై నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగ సంఘాలతో కూడా మాట్లాడాలి. కొత్త ఉత్తర్వుల కోసం ఉన్నతమైన విధానాన్ని ప్రతిపాదించాలి. రాష్ట్రపతి కొత్తగా ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా పోస్టులను భర్తీ చేయాలి. స్థానికతను నిర్ధారించే విషయంలో కూడా శాస్త్రీయమైన పద్ధతి కావాలి. కేవలం ఎక్కడ చదువుకున్నారు అనే అంశమే స్థానికతకు ప్రామాణికం కావడం వల్ల సమస్యలు వస్తున్నాయి. కొంతమంది స్థానికులు నష్టపోవాల్సి వస్తుంది. ఈ విషయంలో కూడా మార్పులు అవసరం. ఇవన్నీ విషయాలను లోతుగా అధ్యయనం చేసి కమిటీ ప్రతిపాదనలు ఇవ్వాలి. కొత్త విధానం రూపొందించాలి. అధికారులు తమ అనుభవాన్ని, పరిణతిని రంగరించి కొత్త విధానానికి రూపకల్పన చేయాలి. వివాదాలకు తావులేని విధంగా కొత్తగా తెచ్చే విధానం భవిష్యత్ తెలంగాణకు బాట చూపాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.

జిల్లా కేడర్ పోస్టులకు కొత్త జిల్లాలే ప్రాతిపదిక:

జిల్లా కేడర్ పోస్టులను కొత్త జిల్లాల ప్రాతిపదికనే నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. డిఎస్సీ నోటిఫికేషన్ కూడా కొత్త జిల్లాల వారీగా జారీ చేయాలని నిర్నయించారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందే స్థానికులకు ఎక్కువ అవకాశాలు రావాలనే ఉద్దేశ్యంతో అని, కాబట్టి ఖచ్చితంగా కొత్త జిల్లాల ప్రాతిపదికనే జిల్లా కేడర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని సిఎం ఆదేశించారు.

కమిటీలో సభ్యులు వీరే:

కొత్తగా జారీ చేయాల్సిన రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించిన ముసాయిదా రూపొందించడానికి, అధ్యయనం చేయడానికి మంత్రులు, అధికారులతో కూడిన కమిటీని ముఖ్యమంత్రి నియమించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు టి.హరీశ్ రావు, పోచారం శ్రీనివాస రెడ్డి, ఈటెల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, సీనియర్ అధికారులు ఎస్.కె.జోషి, సురేష్ చంద్ర, అజయ్ మిశ్రా, బిఆర్ మీనా, రాజీవ్ రంజన్ ఆచార్య, అధర్ సిన్హా, డిజిపి అనురాగ్ శర్మ సభ్యులుగా ఉంటారు.

బ్యాక్ లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి:

అన్ని శాఖల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు. ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలున్న అభ్యర్థులు ఆయా వర్గాల్లో ఉన్నప్పటికీ బ్యాక్ లాగ్ పోస్టులు ఉండడం అన్యాయమని సిఎం అన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ ఇకపై ప్రతీ నెలా చివరి రోజున సమీక్ష నిర్వహించాలని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటవెంటనే భర్తీ చేయాలని చెప్పారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/xCrZZ9

 

Follow Us:
Download App:
  • android
  • ios