అవుటర్ రింగ్ రోడ్డుపై ఓ శీతలపానీయాల ట్రక్కు ప్రమాదానికి గురైంది. అంతే.. అటుగా వెడుతున్న జనం నిమిషాల్లో అందులోని సీసాలను ఎత్తుకెళ్లి.. లారీని ఖాళీ చేశారు. ఇది హైదరాబాద్ లో జరిగింది.
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారామతిపేట్ సమీపంలో ఓఆర్ఆర్పై ఘట్కేసర్ మార్గంలో మంగళవారం రాత్రి ఏడున్నర గంటలకు థమ్స్ అప్ లోడ్ తో వెళ్తున్న లారీ టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ పై పడిపోయింది. దీంతో లారీలోని థమ్స్అప్ కూల్ డ్రింక్ సీసాలు రహదారికి ఇరువైపులా చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఇది గమనించిన వాహనదారులు గాయపడిన డ్రైవర్, క్లీనర్ లను పట్టించుకోకుండా.. తమ వాహనాలను రోడ్డుపైన నిలిపి అందినకాడికి కూల్ డ్రింక్ సీసాలను తీసుకెళ్లారు. దీంతో నిమిషాల్లోనే లారీలోని మొత్తం సరుకు ఖాళీ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా, ఈ జనవరిలో ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది. madhya pradeshలోని విదిశాలో అమానవీయ ఘటన జరిగింది. ఆశ మనుషుల్ని మానవత్వం మరిచిపోయేలా చేసింది. ఫ్రీగా దొరుకుతున్నాయి కదా అని మేకల మీద చూపించిన శ్రద్ధ ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషి మీద చూపించలేకపోయారు. దీంతో ఓ నిండు జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఈ ఘటన వివరాల్లోకి వెడితే..
మధ్యప్రదేశ్ లోని విదిషా నుంచి హైదరాబాద్ కు మేకలను తీసుకెళ్తున్న truck మార్గమధ్యంలో overturns అయ్యింది. డ్రైవర్ అందులో చిక్కుకుపోయాడు. ఈ విషయం తెలిసిన సమీపంలోని గ్రామస్తులు వాటిని పట్టుకు పోయేందుకు పోటీపడ్డారు. కానీ లారీ కింద చిక్కుకుపోయిన వ్యక్తిని మాత్రం ఎవరూ కాపాడలేదు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
మధ్యప్రదేశ్లోని సిరోంజ్ జిల్లా, కంకర్ ఖేడి లోయ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శివపురి నుంచి సుమారు వంద మేకలతో బయలుదేరిన లారీ.. రాత్రి 8 గంటల సమయంలో కంకర్ ఖేడి వద్ద అదుపుతప్పి.. లోయలో పడిపోయింది. ఇది గమనించిన సమీపంలోని గ్రామస్తులు... ఘటనా స్థలానికి పరుగు పరుగున చేరుకున్నారు. అక్కడున్న మేకలను పట్టుకు పోయేందుకు పోటీపడ్డారు. లారీలోని మేకలను అందిన కాడికి దోచుకున్నారు. టూవీలర్ల మీద ఇద్దరిద్దరుగా వచ్చి.. మధ్యలో మేకలను వేసుకుని పట్టుకుపోయారు.
విషయం తెలిసి అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వారించినా వినలేదు. ట్రక్కులోకి ఎక్కిమరీ మేకల్ని తీసుకోసాగారు. దీంతో పోలీసులు విచక్షణా రహితంగా లాఠీఛార్జి చేశారు. అయితే మేకల మీద పెట్టిన శ్రద్ధ ట్రక్కు డ్రైవర్ విషయంలో చూపించలేదు. ట్రక్కు కింద చిక్కుకుపోయిన సచిన్ కాటిక్ అనే వ్యక్తిని మాత్రం ఎవరూ సకాలంలో కాపాడలేదు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.