యాసంగి వరి కొనుగోలుకు సంబంధించి పోరాటం ఉద్ధృతం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనిలో భాగంగా సోమవారం టీఆర్ఎస్ఎల్పీ సమావేశాన్ని నిర్వహించాలని ఆయన డిసైడ్ అయ్యారు. అనంతరం అదే రోజు మంత్రులను వెంటబెట్టుకుని ఢిల్లీకి వెళ్లనున్నారు. 

ఈ నెల 21న సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌లో (telangana bhavan) టిఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం (trs legislative meeting) జరపాలని ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ (trs) అధినేత కె. చంద్రశేఖర్ రావు (k chandrashekar rao) నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని (paddy procurement) కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు ఈ సమావేశంలో రూపకల్పన చేయనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం అదే రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లనుంది. ధాన్యం కొనుగోళ్ళ మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు. తెలంగాణలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్‌సభలో, రాజ్యసభలో టిఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడతారు. 

పంజాబ్ రాష్ట్రానికి చెందిన వరి ధాన్యాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నందున, తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా పంజాబ్ తరహాలో 100 శాతం ఎఫ్‌సిఐ సేకరించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్య అయిన వరి ధాన్యం కొనుగోలుపై ఈ దఫా ఉధృతమైన పోరాటాలకు టిఆర్ఎస్ సిద్ధం అవుతున్నందున ఈ సమావేశానికి ఆహ్వానితులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 

అంతకుముందు కేసీఆర్.. మంత్రులతో ఆకస్మికంగా భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ఈ సమావేశం నిర్వహించారు. సీఎంతో భేటీకి రావాలని ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్ నుంచి మంత్రులకు ఫోన్‌లు వెళ్లాయి. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌తో భేటీలో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు పాల్గొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్‌‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాలనాపరమైన అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో కేసీఆర్ చర్చించారు.