పాపం... టిఆర్ఎస్ అయూబ్ ఖాన్ సచ్చిపోయిండు
- ఒంటిపై గ్యాసు నూనె పోసుకుని కాల్చుకున్న అయూబ్
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- ఆవేదన చెందుతున్న తెలంగాణ ఉద్యమకారులు
- పనిచేసిన వారికి టిఆర్ఎస్ లో పదవులు వస్తలేవని ఆవేదన
తెలంగాణ కోసం పోరాడిన యోధుడు ఆయన. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కష్టపడిన కార్యకర్త. కానీ తెలంగాణ వచ్చి మూడేళ్లవుుతన్నా... పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు రావడంలేదని కలత చెందాడు. ఒకప్పుడు తెలంగాణవాదులను గెదిమి కొట్టిన వారిని అందలమెక్కిస్తుంటే తల్లడిల్లిపోయాడు. పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు రాకపోవడంతో తన నిరసనను బాహ్య ప్రపంచానికి చాటేందుకు ఆయన గత నెల 30వ తేదీన ఒంటిపై గ్యాస్ నూనె పోసుకుని అంటించుకున్నాడు. మూడు వారాల పాటు హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక తది శ్వాస విడిచాడు. ఆయనే వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన టిఆర్ఎస్ కార్యకర్త ఆయూబ్ ఖాన్.
తెలంగాణ ఉద్యమకారుడు టిఆర్ఎస్ తాండూర్ పట్టణ మాజీ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఉద్యమకారుల కు టిఆర్ఎస్ పార్టీ లో గుర్తింపు ఇవ్వటం లేదని టిఆరెస్ పార్టీ మీటింగ్ లో మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో అగస్ట్ 30న వికాారాబాద్ జిల్లా తాండూరులో నిప్పు పెట్టుకున్న సంగతి తెలిసిందే. వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినా ఒల్లంతా కాలిన కారణంగా ఆయన ప్రాణాలను వైద్యులు రక్షించలేకపోయారు. శుక్రవారం తెల్లవారుజామున మరణించాడు.
అయూబ్ ఖాన్ మరణించడంతో తెలంగాణ కోసం కష్టపడి పనిచేసిన ఉద్యమకారులంతా కలత చెందుతున్నారు. నాడు స్వరాష్ట్రం కోసం అనేక మంది ఉద్యమకారులు పనిచేశారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్లకు న్యాయం జరగడంలేదన్న ఆందోళనలో కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణ వ్యతిరేకులు, ఉద్యమకారులపై దాడులు చేసిన వారికి కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక స్థానాలు కట్టబెడుతున్నారని కంటతడి పెడుతున్నారు.