నోరు అదుపులో పెట్టుకోవాలి: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వార్నింగ్
కేసీఆర్ పై విమర్శలు చేస్తే సహించబోమని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై మండిపడ్డారు. దళితబంధుకు ప్రవీణ్ కుమార్ అనుకులమా, వ్యతిరేకమా చెప్పాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, సైదిరెడ్డిలు ప్రశ్నించారు.
హైదరాబాద్: దళితుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించడంపై టీఆర్ఎస్ కు చెందిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు.సోమవారం నాడు ఆయన హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రవీణ్ కుమార్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఆయన కోరారు.దళితబంధుకు ప్రవీణ్ కుమార్ వ్యతిరేకమా? అనుకూలమా? చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
also read:కారు కింద పడతారా..? ఏనుగు ఎక్కుతారా.. మీరే తేల్చుకోండి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
దళితుల కోసం మోడీ ఏం చేయలేకపోయినా ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు.దళితుల కోసం ఉద్యోగానికి రాజీనామా చేశానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రవీణ్కుమార్ కు వ్యతిరేకంగా కొందరు ఫిర్యాదు చేశారన్నారు.ఈ సమయంలో తన ఉద్యోగానికి ఎసరు వచ్చే అవకాశం ఉందని భావించి ఆయన వీఆర్ఎస్ తీసుకొన్నారని కిషోర్ విమర్శించారు. దళితుల కోసం కేసీఆర్ ఆలోచించినంతగా ఎవరూ కూడ ఆలోచించరని ఆయన చెప్పారు.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ బీజేపీ చేతిలో పావుగా మారాడని హుజూర్ నగర్ కు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి విమర్శించారు. దళితబంధు పథకాన్ని కేసీఆర్ ప్రకటించిన తర్వాత అన్ని పార్టీల్లో వణుకుపుట్టిందన్నారు. రైతుబంధు మాదిరిగానే ఈ పథకాన్ని అమలు చేయాలని కేసీఆర్ ప్లాన్ చేశాడన్నారు. ఈ పథకాన్ని ఇంకా సమర్ధవంతంగా అమలు చేసేందుకు సూచనలు చేయాలని ఆయన విపక్షాలను కోరారు. చైనాతో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు మరణిస్తే దేశం మొత్తం ఆయనను గుర్తించేలా చేసిన ఘనత టీఆర్ఎస్ సర్కార్దేనని ఆయన చెప్పారు.