కారు కింద పడతారా..? ఏనుగు ఎక్కుతారా.. మీరే తేల్చుకోండి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఉద్యోగానికి రాజీనామా చేసిన రోజునే తనపై కేసులు పెట్టారని ఆరోపించారు . తాను ఒంటరిగా లేనని.. లక్షలు, కోట్ల మంది బిడ్డ ఈ ప్రవీణ్ అని పేర్కొన్నారు.
తెలంగాణలో బహుజన రాజ్యం రాబోతోందని ఆ రాష్ట్ర బీఎస్పీ సమన్వయకర్త , విశ్రాంత ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. బహుజనులంతా పాలకులవుతారని.. ఏనుగెక్కి ప్రగతి భవన్ కి వెళతామని... ఎర్ర కోటపైనా నీలి జెండా ఎగర వేస్తామని ఆయన పేర్కొన్నారు.
ప్రజలు కారు కింద పడతారా.. ఏనుగెక్కి వెళ్తారా తేల్చుకోవాలని సూచించారు. రిజర్వ్ేషన్లు మన హక్కు అని.. పాలకులు పెట్టే భిక్ష కాదన్నారు. ఆదివారం నల్గొండలో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు.
నల్గొండ ఎంజీ కళాశాల మైదానంలో కాన్షీరాం కాలుమోపిన ఈ ప్రాంతానికి రావడానికి బిడ్డలు ఎన్నో కష్టాలు పడ్డారన్నారు. పోలీసులు అడ్డుకున్నా వారు ఆగలేదన్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన రోజునే తనపై కేసులు పెట్టారని ఆరోపించారు . తాను ఒంటరిగా లేనని.. లక్షలు, కోట్ల మంది బిడ్డ ఈ ప్రవీణ్ అని పేర్కొన్నారు.
ఉద్యోగం ఎందుకు మానేశావని తన అమ్మ అడిగిందని.. లక్షలాది మంది బిడ్డల బతుకు మార్చాలంటే త్యాగం చేయాల్సిన అవసరం ఉందని తాను చెప్పానని గుర్తు చేసుకున్నారు. 17ఏళ్ల పోలీసు జీవితాన్ని వదులుకొని 2012లో గురుకులాల సొసైటీకి వచ్చానని చెప్పారు. తొమ్మిదేళ్ల లో ఎన్నో గొప్ప పనులు చేశానన్నారు. కరోనా సమయంలో పాఠశాలలు మూసివేశారని.. ఒక ఇంజినీరింగ్ కళాశాలను మాట్లాడుకొని.. అక్కడే ఉంచి చదువుకుంటుంటే ఎవరో సమాచారం ఇవ్వడంతో... జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధికారులు వచ్చి.. పిల్లలను వారికి ఇంటికి పంపించేశారన్నారు.
తాను బాలల హక్కులను హరింప చేస్తున్నానని పలువురు ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు తనపై పార్లమెంట్ సాక్షిగా అసత్య ఆరోపణలు చేశారని ఆయన పేర్కొన్నారు.