Etela Rajender: ఈటలను ఆత్మీయ అలింగనం చేసుకున్న టీఆర్ఎస్ ఎంపీ కేకే.. కేటీఆర్ మాత్రం అలా!.. అసలేం జరిగిందంటే..
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender).. టీఆర్ఎస్ అగ్రనేత, ఎంపీ కే కేశరావు (MP Keshava Rao) ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender).. టీఆర్ఎస్ అగ్రనేత, ఎంపీ కే కేశరావు (MP Keshava Rao) ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకున్నారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ను కేకే ఆత్మీయంగా అలింగనం చేసుకున్నారు. ఇందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడి వివాహా వేడుకగా నిలిచింది. ప్రస్తుతం ఇది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఈటల రాజేందర్పై భు కబ్జా ఆరోపణలు రావడం.. సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ టీఆర్ఎస్కు దూరమయ్యారు. మంత్రి పదవితో పాటు హుజురాబాద్ ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరి.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఈటల బీజేపీ నుంచి దూరమైన తర్వాత టీఆర్ఎస్ నేతలు దూరంగా ఉంటున్నారు. ఆయనతో మాట్లాడటం అటు ఉంచితే ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు సన్నిహితంగా ఉన్నవారు సైతం.. గులాబీ బాస్ ఎమనుకుంటాడో అని ఈటలతో దూరంగా ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు, టీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న కే కేశవరావు మాత్రం ఈటల రాజేందర్ను అప్యాయంగా పలకరించారు.
ఇద్దరు సరదాగా..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడి వివాహా వేడుక ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకకు పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు హాజరైన ఈటల రాజేందర్తో పలువురు టీఆర్ఎస్ నేతలు తారసపడ్డారు. మిగిలిన వారెవ్వరూ ఈటల రాజేందర్ను పలకరించలేదు. ఈటలను చూసిన వెంటనే ఆయన వద్దకు చేరుకున్న కేకే... ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. నవ్వుతూ పలకరించారు.
ఈటల మీద చెయ్యి వేసిన కేకే ప్రేమగా కాసేపు మాట్లాడారు. ఇద్దరి మధ్య సంభాషణ సరదాగా సాగింది. కేకే తన మాస్క్తో ఈటలను సరదాగా కొట్టడం అక్కడి వారిలో నవ్వులు పూయించింది. అయితే ఈటల, కేకేల మధ్య అప్యాయ పలకరింపు.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా టీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో వారి మధ్య ఉన్న చనువుతోనే కేకే.. ఈటలను అప్యాయంగా పలకరించి ఉంటారని, అంతకు మించి పెద్దగా రాజకీయ ప్రాధాన్యత ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పక్కనుంచి వెళ్లిపోయిన మంత్రి కేటీఆర్..
మరోవైపు ఈటల వివాహ వేడుకకు ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే మంత్రి కేటీఆర్ కూడా అక్కడికి వచ్చారు. ఆ సమయంలో ఈటలతో పలువురు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అయితే అటుగా వచ్చిన మంత్రి కేటీఆర్ మాత్రం.. ఈటలకు కొద్ది దూరంగా పక్క నుంచి చాలా ఫాస్ట్గా ముందుకు కదిలారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.