తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సోమవారం తమిళనాడుకు (tamil nadu) వెళ్లనున్నారు. నేడు ఆయన శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయానికి (Ranganathaswamy Temple) చేరుకుని.. స్వామివారిని దర్శించుకుంటారు. రేపు ఆయన తమిళనాడు సీఎం స్టాలితో భేటీ కానున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సోమవారం తమిళనాడుకు (tamil nadu) వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా ఆయన ఈ పర్యటనకు వెళ్తున్నారు. కేసీఆర్ కుటుంబంతో కలిసి.. సోమవారం ఉదయం 11.10 గంటల సమయంలో బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో తిరుచిరాపల్లి విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా అక్కడి నుంచి ఎస్‌ఆర్‌ఎం హోటల్‌కు చేరుకొని, మధ్యాహ్నం 3 గంటల సమయంలో శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయానికి (Ranganathaswamy Temple) చేరుకుని.. స్వామివారిని దర్శించుకుంటారు. రంగనాథస్వామి దర్శనం తర్వాత ఆయన తిరిగి విమాశ్రయం చేరుకుని.. అక్కడి నుంచి చెన్నైకి చేరుకుంటారు. రాత్రి చెన్నైలోని ఐటీసీ గ్రాండ్‌ హోటల్‌లో స్టే చేయనున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక, మంగళవారం కేసీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది. రేపు సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్.. స్టాలిన్‌తో భేటీ కానున్నారు. ధాన్యం కొనుగోలుతో పాటు, ఇతర అంశాలపై కేంద్రంతో పోరు సాగిస్తామని చెబుతున్న సీఎం కేసీఆర్.. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనురిస్తున్న విధానాలతో పాటుగా, రాష్ట్రాల పట్ల బీజేపీ వైఖరి, కేంద్రం రైతు వ్యతిరేక విధానాలతో పాటు.. దేశంలోని తాజా రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అంశం ఉంది. అంతేకాకుండా యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షకు స్టాలిన్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించనున్నారు. 

ఇక, 2019లో లోక్ సభ ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ కుటుంబ సమేతంగా రంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో అప్పుడు డీఎంకే అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఫెడరల్ ఫ్రెంట్ గురించి కేసీఆర్.. స్టాలిన్‌తో చర్చించారు.

తన పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్.. తెలుగు రాష్ట్రాల మాజీ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను పరామర్శించనున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న నరసింహన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా సమాచారం. ఇటీవల సతీమణిని కోల్పోయిన తమిళనాడు మంత్రి సీవీ గణేషన్‌ను పరామర్శించనున్నారు. సీవీ గణేషన్‌కు తెలంగాణలో పలు పరిశ్రమల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఇక, కేసీఆర్ తమిళనాడు పర్యటన మొత్తం నాలుగు రోజులు సాగనున్నట్టుగా సమాచారం.