నోటీసులపై కల్వకుంట్ల కవిత స్పందన... ముందు ఆ రెండు డాక్యుమెంట్లు పంపండి : సీబీఐకి లేఖ
సీబీఐ అధికారులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి తనకు ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఫిర్యాదు కాపీని సమర్పించాలని ఆమె కోరారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ తనకు జారీ చేసిన నోటీసులపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ మేరకు శనివారం ఆమె సీబీఐకి లేఖ రాశారు. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఫిర్యాదు కాపీని తనకు సమర్పించాలని ఆమె లేఖలో కోరారు. ఈ మేరకు సీబీఐ అధికారి అలోక్ కుమార్కు లేఖను పంపారు. తన వివరణ ఇచ్చేముందు రెండు డాక్యుమెంట్లను ఇవ్వాలని కవిత కోరారు. శుక్రవారం నాడు కవితకు సీఆర్పీసీ 160 కింద నోటీసులిచ్చింది సీబీఐ. డాక్యుమెంట్లు పంపిన తర్వాతే వివరణ తేదీ ఫిక్స్ చేద్దామని కవిత లేఖలో పేర్కొన్నారు. ఫిర్యాదు కాపీతో పాటు ఎఫ్ఐఆర్ను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని కవిత కోరింది. అలాగే సంబంధిత అనుబంధ కాపీలను కూడా అందించాలని ఆమె కోరారు.
కాగా... ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి.. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద కవితకు సీబీఐ నోటీసులు జారీచేసింది. బంజారాహిల్స్లోని రోడ్ నంబర్ 12లోని కవిత నివాస చిరునామాను సీబీఐ నోటీసులో పేర్కొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణ సందర్భంగా కవితకు సంబంధం ఉన్న కొన్ని వాస్తవాలను గుర్తించామని పేర్కొంది. అందువల్ల దర్యాప్తు కోసం ఆమె నుంచి వాస్తవాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది.
ALso Read:ప్రగతి భవన్కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత.. కేసీఆర్తో కీలక భేటీ..!
రెండు రోజుల క్రితం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో తన పేరును ప్రస్తావించడంపై స్పందించిన కవిత.. ఎలాంటి విచారణను ఎదుర్కొవడానికైనా సిద్దమని చెప్పారు. మోదీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లల్లో.. 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారిలో బీజేపీ అధికారంలో వచ్చిందని విమర్శించారు. ఏ రాష్ట్రానికైనా మోదీ పోయే ముందు.. ఈడీ రావడం చూస్తూనే ఉన్నామని అన్నారు. తెలంగాణలో వచ్చే ఏడాది డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి కనుకే.. మోదీ కన్నా ముందు ఈడీ వచ్చిందని విమర్శించారు. ఇది కామనే అని అన్నారు. తన మీద, మంత్రుల మీద, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై మీద ఈడీ కేసులు పెట్టడం బీజేపీ హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ అని మండిపడ్డారు. ఇలాంటి వాటిని పట్టించుకునే అవసరం లేదని అన్నారు.
దర్యాప్తు సంస్థలు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం చెబుతున్నామని కవిత తెలిపారు. మీడియాలో లీక్లు ఇచ్చి నాయకులకు ఉన్న మంచి పేరు చెడగొడున్నారని విమర్శించారు ఇలాంటి వాటిని ప్రజలు తిప్పికొడతారని అన్నారు. ఈ పంథా మార్చుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ఈడీ, సీబీఐలను ప్రయోగించి గెలవాలని అనుకుంటే చైతన్యవంతమైన తెలంగాణలో అది కుదరని పని అన్నారు. కేసులు పెడతాం, జైల్లో పెడతామంటే పెట్టుకోండి.. భయపడేది లేదని అన్నారు. జైలులో పెడితే ఏమైతది అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని అన్నారు. ఇక, మీడియాతో మాట్లాడిన అనంతరం కవిత జగిత్యాల జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.