అంబేద్కర్ వర్ధంతి రోజునే... రోడ్డెక్కిన టీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యే రాజయ్య
అధికారుల తీరుకు నిరసనగా అంబేద్కర్ వర్ధంతి రోజునే అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ధర్నాకు దిగారు.
వరంగల్: ఆయన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే. టీఆర్ఎస్ పార్టీ ఎంతోకాలంగా కొనసాగుతున్న దళిత నాయకుడు. గతంలో డిప్యూటీ సీఎం వంటి అత్యున్నత పదవిలో కొనసాగిన నాయకుడు. ఇలాంటి నాయకుడే తన నియోజకవర్గంలో అభివృద్ది పనుల కోసం రోడ్డుపై బైఠాయించిన నిరసనకు దిగాడంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా వుందో అర్థమవుతుంది.
అధికార టీఆర్ఎస్ పార్టీ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (T Rajaiah) సోమవారం రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. స్టేషన్ ఘనపూర్లో అంబేద్కర్, గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని... సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేసి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ఎంతోకాలంగా అధికారులను రాజయ్య కోరుతున్నారట. అయితే ఆయన మాటలను పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అంబేద్కర్ వర్దంతి (ambedkar vardanthi) రోజున స్వయంగా దళిత ఎమ్మెల్యేనే ఆందోళన బాట పట్టారు.
స్థానిక అధికారుల తీరును నిరసిస్తూ (station ghanpur) ఎమ్మెల్యే రాజయ్య ధర్నానిర్వహించారు. వరంగల్-హైదరాబాద్ హైవేపై ఆయన అనచరులతో కలిసి బైఠాయించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఎమ్మెల్యే రాజయ్య ధర్నా స్థానికంగా సంచలనం సృష్టించింది.
read more పంచె కట్టుకొన్నాడని డిప్యూటీ సీఎంను పదవి నుండి తప్పించారు: కేసీఆర్పై రేవంత్ రెడ్డి
ఎమ్మెల్యే రాజయ్య టీఆర్ఎస్ (TRS) ను వీడనున్నారన్న ప్రచారం నేపథ్యంలో తాజా ధర్నా రాజకీయ చర్చకు దారితీసింది. ఇప్పటికే వైఎస్సార్ తెలంగాణ పార్టీ (ysrtp) చీఫ్ వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ తో రాజయ్య సమావేశమమై పార్టీలో చేరికపై చర్చించినట్లు ప్రచారం జరిగింది. అయితే పార్టీ మారబోనని రాజయ్య వివరణ ఇచ్చినా ఆయన వ్యవహారతీరుతో అనుమానాలు బలపడుతున్నాయి.
తాటికొండ రాజయ్య కొద్ది రోజులుగా బ్రదర్ అనిల్ తో తరుచుగా సమావేశమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారి భేటీ గురించి వైఎస్సార్ తెలంగాణ పార్టీ వర్గాలు గుసగుసగా చెబుకుంటున్నాయి. ఈ భేటీ మతపరమైందా, రాజకీయపరమైందా అనే విషయంపై స్పష్టత లేదు.
ఈ భేటీపై టీఆర్ఎస్ నాయకత్వం తీవ్రమైన ఆసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రాజయ్యపై టీఆర్ఎస్ నాయకత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనే విషయం తెలియడం లేదు. కాగా గతంలో కేసీఆర్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.
read more టీఆర్ఎస్ ను వీడనని చెప్పా: బ్రదర్ అనిల్ తో భేటీపై తాటికొండ రాజయ్య వివరణ
తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాజయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గం నుంచి తొలిగించారు. దాంతో ఆయన అప్పటి నుంచి ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. రెండోసారి రాజయ్యకు టీఆర్ఎస్ టికెట్ రాదని భావించారు. కానీ కేసీఆర్ ఆయననే పోటీకి దించారు. రెండోసారి గెలిచిన తర్వాత కూడా టీఆర్ఎస్ లో రాజయ్య స్థాయి మారలేదు. దానికితోడు వరంగల్ జిల్లాలోని సీనియర్ నేత కడియం శ్రీహరితో ఆయనకు ఏ మాత్రం పొసగడం లేదు.
ఇక టీఆర్ఎస్ లోనే వుంటే రాజకీయ భవిష్యత్ లేదని రాజయ్య భావిస్తున్నారట. అందువల్లే ఇతర పార్టీల వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ టిపి పార్టీలో చేరాలని రాజయ్య భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.