నోముల నర్సింహయ్య మృతి: కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నోముల నర్సింహయ్య మృతి టీఆర్ఎస్ కు, నియోజకవర్గం ప్రజలకు తీరని లోటు అని ఆయన అన్నారు.
హైదరాబాద్: ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నోముల నర్సింహయ్య తన జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా నిలిచిపోతారని కేసీఆర్ అన్నారు. నోముల నర్సింహయ్య మరణం టీఆర్ఎస్ పార్టీకి, నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అని ఆయన అన్నారు. నోముల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
నర్సింహయ్య మరణం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. నమ్మిన సిద్దాంతం కోసం ప్రజల వెంట నడిచారని, తెలంగాణ కోసం దశాబ్దాలుగా వెంట నడిచిన పార్టీని విడిచి ప్రజల ఆకాంక్షల కోసం టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ వెంట నడిచారని అన్నారు.
నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల నరసింహామయ్య ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఆయన మరణం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి జగదీష్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. నల్గొండ జిల్లా ఒక మంచి నిస్వార్థ రాజకీయ నాయకుడిని కోల్పోయిందని వివరించారు. ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన నర్సింహయ్య లోటును ఎవరు తీర్చలేరన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితం ప్రజా పోరాటాలతోనే కొనసాగిందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. ఆయన మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటని తెలిపారు. నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు