గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఒకటి తగ్గినా  అమిత్‌ షా కరీంనగర్‌ వచ్చి ముక్కు నేలకు రాయాలని సవాల్‌ విసిరారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కరీనంగర్ బీజేపీ నేత బండి సంజయ్ లపై టీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఆయన అమిత్‌ షా కాదని జూఠా షా అని ఎద్దేవా చేశారు. గద్దెనెక్కేందుకు మేము అబద్దాలు చెప్పామని ఆ పార్టీ నేత గడ్కరీ ఇప్పటికే చెప్పారని తెలిపారు. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఒకటి తగ్గినా బీజేపీ నాయకులు అమిత్‌ షా కరీంనగర్‌ వచ్చి ముక్కు నేలకు రాయాలని సవాల్‌ విసిరారు. మతాన్ని అడ్డు పెట్టుకుని గెలవాలన్న మీ ప్రయత్నం ఇక్కడ సాగదన్నారు.

బీజేపీ నేత బండి సంజయ్‌కు బీపీ వచ్చి నాపై మాఫియా అంటూ విమర్శలు చేశారని కమలాకర్‌ ఆరోపించారు. తనపై ఐటీ దాడులు చేస్తే వేల కోట్ల రూపాయలు దొరుకుతాయని మతితప్పి మాట్లాడారని విమర్శించారు. 1992 నుంచి మా కుటుంబానికి గ్రానైట్‌ వ్యాపారం ఉందని, ఇన్‌కం టాక్స్‌ కట్టి నిజాయతీగా సంపాదించుకుంటున్నామని వ్యాఖ్యానించారు. సంజయ్‌ మరోసారి తనపై లేనిపోని విమర్శలు చేస్తే గుండు కొట్టించి గాడిదపై ఊరేగిస్తా అని హెచ్చరించారు. నా జోలికొస్తే ఖతమైపోతావ్‌ బిడ్డా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో మతరాజకీయాలు నడవవుని చెప్పారు.